తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ లక్షద్వీప్ పర్యటన- ట్రెండింగ్​లో 'బాయ్​కాట్​ మాల్దీవులు'- చర్యలు తీసుకుంటామన్న సర్కార్​

Maldives India Issue : హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన కలకలం సృష్టిస్తోంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన ట్వీట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఈ వివాదంపై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. మంత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 2:56 PM IST

Updated : Jan 7, 2024, 6:32 PM IST

Maldives India Issue
Maldives India Issue

Maldives India Issue : 36ద్వీపాల సమాహారమైన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవుల్లో గుబులురేపుతోంది. ఆ దేశ మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్‌ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోదీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖలపై భారత సెలబ్రిటీలు కూడా దీటుగా స్పందిస్తున్నారు. అక్కడి అందాలను వివరిస్తూ సోషల్​మీడియాలో మాల్దీవుల మంత్రులకు బదులిస్తున్నారు.

మంత్రులపై చర్యలు!
మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌తోపాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ దేశ సర్కార్ దిద్దుబాటు చర్యల కోసం రంగంలోకి దిగింది. ప్రధాని మోదీతోపాటు భారత్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని పేర్కొంది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. భావప్రకటనా స్వేచ్ఛను ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని అది ద్వేషాన్ని పెంపొందించేదిగా ఉండకూడదని హితవు పలికింది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

సెలబ్రిటీల మద్దతు
మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యటక గమస్థానం లక్షద్వీప్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ బాయకాట్​ మాల్దీవులు హ్యాష్​ట్యాగ్​ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. భారత్​లోని లక్షద్వీప్​, సింధుదుర్గ్ లాంటి ద్వీపాలను సందర్శించాలని సెలబ్రిటీలు విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్​ అబ్రహం, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ దీనికి మద్దతు తెలుపుతూ ఎక్స్​లో పోస్ట్ చేశారు. మరోవైపు భారత్‌తో వివాదం వేళ మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన అన్ని వెబ్‌సైట్లు సాంకేతిక లోపం తలెత్తి డౌన్‌ అయ్యాయి.

మంత్రి వ్యాఖ్యలపై మాల్దీవుల మాజీ అధ్యక్షులు ఫైర్​!
మాల్దీవుల మంత్రి అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్​ నషీద్​ సైతం విచారం వ్యక్తం చేశారు. మాల్దీవుల శ్రేయస్సు, భద్రతలో కీలకమైన మిత్రదేశ నాయకుడిని విమర్శించడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని సూచించారు. తమ ప్రభుత్వ విధానానికి ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని భారత్​కు స్పష్టత ఇవ్వాలని చెప్పారు.

మరో మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ కూడా స్పందించారు. "సోషల్ మీడియాలో మాల్దీవుల మంత్రులు భారతదేశంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. భారత్- మాల్దీవుల స్నేహపూర్వక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అలాంటి వ్యాఖ్యలను ఎప్పుడూ అనుమతించకూడదు" అని ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే?
32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన లక్షద్వీప్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రధాని మోదీ అక్కడ సముద్ర తీరంలో ఇటీవలే విహరించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. అంతేకాదు స్నార్కెలింగ్‌ అనే సాహస స్మిమ్మింగ్‌ చేసి సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు మోదీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ఎక్స్‌(ట్విట్టర్​) ఖాతాలో షేర్ చేశారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో లక్షదీవులు మంత్రముగ్ధులను చేస్తున్నాయని రాసుకొచ్చారు.

అయితే దేశీయంగా పర్యటకాన్ని ప్రోత్సహించేలా మోదీ లక్షద్వీప్‌ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ వివాదం మొదలైంది. మాల్దీవులను భారత్‌ లక్ష్యంగా చేసుకుంటుందని ఆ దేశ మంత్రులు ఆరోపించారు. బీచ్‌ టూరిజంలో తమతో పోటీపడడంలో భారత్‌ సవాళ్లు ఎదుర్కొంటోందని ఎద్దేవా చేశారు. దీంతోపాటు పలు వ్యాఖ్యలు చేశారు.

భారత్​పైనే మాల్దీవులు ఆధారం
పర్యటకం ద్వారా మాల్దీవులు ఎంతో ఆర్జిస్తోంది. ఆ దేశాన్ని సందర్శించే విదేశీ పర్యటకుల్లో భారతీయులదే అగ్రస్థానం. ఏడాదికి 2 లక్షల మందికిపైగా భారతీయులు మాల్దీవులను సందర్శిస్తున్నారు. మాల్దీవులు అన్ని రకాలుగా భారత్‌పై ఆధారపడుతుంది. మాల్దీవులకు చెందిన వేలాదిమంది ప్రజలు భారత్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు.

1988లో శ్రీలంకకు చెందిన కొందరు ఉగ్రవాదులు మాల్దీవులపై దాడి చేయగా భారత వాయుసేన వారిని తరిమికొట్టి అప్పటి దేశాధ్యక్షుడిని రక్షించింది. అయితే ఇటీవల జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌ సన్నిహితుడు మహ్మద్‌ ముయిజ్జు గెలుపొంది పగ్గాలు చేపట్టడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే మోదీ లక్షద్వీప్‌ పర్యటనను ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది.

సముద్రంలో మోదీ 'స్నార్కెలింగ్‌' సాహసం- ప్రకృతి అందాలను ఆస్వాదించిన ప్రధాని

మోదీకి 'రూల్​ ఆఫ్​ నిషాన్​ ఇజ్జుద్దీన్​' పురస్కారం

Last Updated : Jan 7, 2024, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details