తెలంగాణ

telangana

మాల్దీవులు మంత్రులపై టూరిజం ఇండస్ట్రీ ఫైర్​- ఆయనపై పార్లమెంట్ విచారణ!

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 9:34 AM IST

Maldives Controversy : భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే సొంత పార్టీ నేతలు వ్యతిరేకించగా, మరో ఎంపీ మంత్రులకు సమన్లు జారీ చేయాలని కోరారు. అక్కడి పర్యటక సంఘం కూడా మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

Etv Bharat
Etv Bharat

Maldives Controversy : భారత ప్రధాని నరేంద్ర మోదీపై అగౌరవ వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి. విదేశాంగ మంత్రిని బాధ్యుడిని చేస్తూ ఆయనకు పార్లమెంట్ సమన్లు పంపించాలని ఆ దేశ ఎంపీ మిఖైల్ నసీమ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై జవాబుదారీతనం అవసరమని, ఇందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి సమన్లు జారీ చేసి ఆయన్ను ప్రశ్నించాలని కోరారు. పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

పర్యటక పరిశ్రమల సంఘం ఫైర్​
మరోవైపు మోదీపై మాల్దీవులమంత్రులు చేసిన వ్యాఖ్యలను అక్కడి పర్యటక పరిశ్రమలు తీవ్రంగా ఖండించాయి. "భారత్​ మాకు మంచి పొరుగు మిత్ర దేశం. దేశంలో తలెత్తిన వివిధ విపత్కర పరిస్థితుల్లో భారత్​ మొదట స్పందించి అండగా నిలిచింది. ఇందుకు భారత ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలకు మనము ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉండాలి. మాల్దీవుల పర్యటక రంగం అభివృద్ధిలో భారత్​ ప్రధానపాత్ర పోషిస్తుంది. కరోనా తర్వాత పర్యటక రంగం పుంజుకోవడంలోనూ భారత్ ఎంతో కృషి చేసింది. భారత్​ ఎన్నో ఏళ్లుగా మాల్దీవులకు ప్రధాన మార్కెట్​గా ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగాలి" అని మాల్దీవులు టూరిజం పరిశ్రమల సంఘం తెలిపింది.

విమానాల బుకింగ్‌ను నిలిపేసిన ఈజ్‌ మైట్రిప్‌
మరోవైపు మాల్దీవులపై ప్రైవేటు పర్యాటక సంస్థ ఈజ్‌ మైట్రిప్‌ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమానాల బుకింగ్‌ను నిలిపేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్‌ పిత్తీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది.

ఆ ముగ్గురు మంత్రులపై వేటు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవులు ప్రభుత్వం ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవులు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో చెప్పింది. అయితే, ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది మాత్రం వెల్లడించలేదు. మాల్దీవులు స్థానిక మీడియా ప్రకారం, మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్‌ జిహాన్‌లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్​లోకి లక్షద్వీప్​- 3వేల శాతం పెరిగిన గూగుల్ సెర్చింగ్​

మాల్దీవులు రాయబారికి భారత్ సమన్లు- లక్షద్వీప్ వ్యవహారంపై అసహనం!

ABOUT THE AUTHOR

...view details