మహారాష్ట్రలోని గడ్చిరోలీ అటవీ ప్రాంతం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఎటపల్లి పరిధిలోని కొట్మీ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సలైట్లకు తీవ్రనష్టం వాటిల్లింది. కమాండోల కాల్పుల్లో 13 మంది నక్సల్స్ హతమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గతనెల.. ఛత్తీస్గఢ్లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22మంది భద్రతాదళాలు చనిపోయిన తర్వాత నక్సల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
శుక్రవారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటన జరిగినట్టు గడ్చిరోలీ డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. కొట్మీ అటవీ ప్రాంతంలో నక్సల్స్ సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో.. సీ-60 కమాండోలు కూంబింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. వారికి తారసపడిన నక్సల్స్.. కాల్పులకు దిగగా.. అప్రమత్తమైన కమాండోలు ఎదురుకాల్పులకు దిగారన్నారు. ఈ ఘటనలో 13 మంది నక్సల్స్ చనిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు గంటసేపు ఇరువైపులా భీకరంగా కాల్పులు జరిగినట్టు సమాచారం.