తెలంగాణ

telangana

By

Published : Dec 23, 2021, 8:11 PM IST

ETV Bharat / bharat

జిల్లా కోర్టులో పేలుడు.. ఉగ్రవాదుల పనేనా?

Ludhiana blast: పంజాబ్​లోని లుథియానా జిల్లా కోర్టు సముదాయంలో భారీ పేలుడు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ పేలుడు సంభవించటంపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. బయటి శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్రోహ శక్తుల పనిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ పేర్కొన్నారు. ఈ క్రమంలో దాడి చేసింది ఉగ్రవాదులేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

Ludhiana blast
కోర్టు కాంప్లెక్స్​లో పేలుడు

Blast in court complex Ludhiana: పంజాబ్​లోని లుథియానా జిల్లా, సెషన్స్​ కోర్టు సముదాయంలో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు కలకలం సృష్టించింది. కోర్టు కాంప్లెక్స్​లోని రెండో అంతస్తులో ఉన్న మూత్రశాలలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దంతో జరిగిన పేలుడు ధాటికి కోర్టు భవనంలో రెండో అంతస్తు దెబ్బతింది. వాష్​రూమ్​ సమీపంలోని గదుల్లో అద్దాలు పగిలిపోయాయి. గోడ శిథిలాలు కింద ఉన్న వాహనాలపై పడి ధ్వంసమయ్యాయి.

పేలుడుతో ధ్వంసమైన భవనం

లుథియానా పోలీస్​ కమిషనర్​ కార్యాలయానికి అతి సమీపంలోనే.. ఈ జిల్లా కోర్టుల సముదాయం ఉంది. పేలుడు జరిగిన వెంటనే.. న్యాయస్థానం చుట్టుపక్కల ప్రాంతాలను దిగ్బంధించిన పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని లుథియానా పోలీస్​ కమిషనర్​ గురుప్రీత్​ సింగ్​ భుల్లారు తెలిపారు. ఫోరెన్సిక్​ బృందం రంగంలోకి దిగి నమూనాలు సేకరిస్తోందని చెప్పారు. ఈ ఘటనలో దుర్మరణం చెందిన వ్యక్తిపైనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు చెప్పారు భుల్లార్​. మానవ బాంబుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. బాంబు పేలిన ప్రాంతానికి అతి దగ్గరలో మృతదేహం లభించటమే అందుకు కారణంగా భావిస్తున్నామన్నారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు.

పేలుడు ప్రాంతంలో పోలీసులు

కోర్టులోని మూత్రశాలల్లో బాంబు పెట్టినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కోర్టులోని సెన్సార్లు, ఇతర భద్రతా పరికరాలు పనిచేయటం లేదన్నారు.

కోర్టు ప్రాంగణంలో పోలీసుల తనిఖీలు

ఘటనా స్థలానికి ఎన్​ఐఏ..

పేలుడు జరిగిన క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన రెండు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ కేసును ఎన్​ఐఏనే చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని అధికారవర్గాలు తెలిపాయి.

పోలీసుల తనిఖీలు

ఉగ్రవాదుల పనేనా?

లుథియానా కోర్టు సముదాయంలో పేలుడుతో పోలీస్​ శాఖ అప్రమత్తమైంది. పంజాబ్​ సరిహద్దు రాష్ట్రం అయినందున.. బయటి శక్తుల ప్రమేయం ఉందనే వాదనను తోసిపుచ్చలేమన్నారు ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్​ సింగ్​ రంధవా. భద్రతను కట్టుదిట్టం చేశామని.. రాష్ట్రం మొత్తం హైఅలర్ట్​లో ఉందని చెప్పారు.

పేలుడు ధాటికి ధ్వంసమైన గోడలు

నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ..

లుథియానాలోని కోర్టు సముదాయాల్లో భారీ పేలుడుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పంజాబ్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం హోంశాఖ. వీలైనంత త్వరగా పూర్తి సమాచారంతో నివేదిక పంపాలని స్పష్టం చేసింది. అలాగే.. ప్రాథమిక విచారణలో తేలిన అంశాలు, పేలుడుకు పాల్పడే అవకాశం ఉన్న వారి వివరాలనూ సమర్పించాలని కోరింది.

పేలుడు స్థలంలో తనిఖీలు

అమిత్​ షాకు వివరాలు..

లుథియానా జిల్లా కోర్టు సముదాయాల్లో పేలుడు ఘటనపై పంజాబ్​ ఉన్నతాధికారులతో మాట్లాడారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ కుమార్​ భల్లా. ఆ తర్వాత పేలుడు వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు వివరించారు.

శిథిలాలు పడి ధ్వంసమైన కార్లు

విద్రోహ శక్తుల పనే..

కోర్టు సముదాయాల్లో పేలుడు ఘటనను ఖండించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో.. కొన్ని సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తులు రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘటనకు బాధ్యులను వదిలిపెట్టబోమన్నారు. మరోవైపు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తే బాంబును ఆపరేట్​ చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.

లుథియానాకు వెళ్లి పరిస్థితులను సమీక్షించారు సీఎం చన్నీ. పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామని, పోలీసులకు ఆ సామర్థ్యం ఉందన్నారు. ఆయనతో పాటు పంజాబ్​ ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్​ సింగ్​ రంధవా, రాష్ట్ర మంత్రి భరత్​ భూషణ్​ ఆశూ సైతం ఆసుపత్రికి వెళ్లారు.

క్షతగాత్రులను పరామర్శిస్తున్న సీఎం చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ

ఖండించిన రాహుల్​ గాంధీ

పంజాబ్​లోని లుథియానా జిల్లా కోర్టులో పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. " లుథియానాలో జరిగిన పేలుడు తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధ్యులపై వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలి. " అని ట్వీట్​ చేశారు.

సీజేఐ దిగ్భ్రాంతి..

లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో గురువారం జరిగిన పేలుడు ఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడుపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని పంజాబ్​, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details