తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్రిదళాధిపతిగా అనిల్ చౌహాన్.. బిపిన్ రావత్ స్థానం భర్తీ

By

Published : Sep 28, 2022, 6:48 PM IST

Updated : Sep 28, 2022, 7:28 PM IST

next cds of india 2022
భారత్​కు తదుపరి CDSగా లెఫ్టినెంట్ జనరల్​ అనిల్ చౌహాన్

18:45 September 28

భారత్​కు తదుపరి CDSగా లెఫ్టినెంట్ జనరల్​ అనిల్ చౌహాన్

Next CDC of India 2022 : భారత్ దేశ త్రిదళాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్​(విశ్రాంత) అనిల్ చౌహాన్​ నియమితులయ్యారు. గతేడాది చాపర్​ ప్రమాదంలో సీడీఎస్​ బిపిన్ రావత్​ మరణించిన నేపథ్యంలో.. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ కేంద్రప్రభుత్వం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ అనిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

అనిల్ చౌహాన్.. ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్​గా 2021 మే నెలలో పదవీ విరమణ పొందారు. అనంతరం జాతీయ భద్రతా మండలిలో చేరారు. ప్రస్తుతం జాతీయ భద్రతామండలి సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్​గా బాధ్యతలు చేపట్టనున్న అనిల్ చౌహాన్.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆ పదవిలో కొనసాగుతారని కేంద్రం స్పష్టం చేసింది.

దేశ సేవలో 40 ఏళ్లు..
దాదాపు 40ఏళ్లపాటు సైన్యంలో సేవలు అందించారు లెఫ్టినెంట్ జనరల్​ అనిల్ చౌహాన్. అనేక కీలక పదవుల్లో పనిచేశారు. జమ్ముకశ్మీర్​, ఈశాన్య భారత్​లో తీవ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకోవడంలో ఆయనకు విశేష అనుభవం ఉందని కేంద్రం ప్రకటనలో పేర్కొంది. ఆయన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలు..

  • 1961 మే 18న ఉత్తరాఖండ్​లోని ఘర్వాల్​లో జన్మించారు. మహారాష్ట్ర ఘడక్​వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీ, ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లోని​ ఇండియన్​ మిలటరీ అకాడమీలో సైనిక శిక్షణ పొందారు.
  • నార్తర్న్ కమాండ్​లోని బారాముల్లా సెక్టార్​లో మేజర్ జనరల్ హోదాలో ఇన్​ఫాంట్రీ డివిజన్​కు అనిల్​ నేతృత్వం వహించారు.
  • ఈశాన్య భారతంలోనూ కమాండర్​గా పనిచేశారు. 2019 సెప్టెంబర్​లో తూర్పు కమాండ్​ జనరల్​ ఆఫీసర్​ కమాండింగ్​ ఇన్​ చీఫ్​గా పదోన్నతి పొందారు. 2021 మేలో పదవీ విరమణ పొందారు.
  • పదవీ విరమణ తర్వాత కూడా సేవలు కొనసాగించారు అనిల్ చౌహాన్. జాతీయ భద్రతకు కీలకమైన అనేక అంశాల్లో తన విలువైన సలహాలు అందించారు.
  • సైన్యంలో అందించిన సేవలకుగానూ పరమ్​ విశిష్ట్ సేవా పతకం, ఉత్తమ్​ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట్ సేవా పతకం, సేనా పతకం, విశిష్ట్ సేవా పతకం అందుకున్నారు అనిల్ చౌహాన్.

సీడీఎస్​ వ్యవస్థను కొన్నేళ్ల క్రితం తొలిసారి ఎన్​డీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 2020 జనవరి 1న జనరల్ బిపిన్ రావత్​ భారత దేశ తొలి సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తమిళనాడులోని కూనూర్​ సమీపంలో 2021 డిసెంబర్​ 8న జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తదుపరి సీడీఎస్​గా ఎవరిని నియమించాలనే అంశంపై 9 నెలలపాటు విస్తృత కసరత్తు చేసిన కేంద్రం.. చివరకు అనిల్​ చౌహాన్​ను ఎంపిక చేసింది.

సీడీఎస్​ బాధ్యతలు, అధికారాలు

  • త్రివిధ దళాల అధిపతులతో సమానంగా, మూడు దళాలకు ప్రథముడిగా సీడీఎస్‌ ఉంటారు. ప్రొటోకాల్‌ జాబితాలో వారి కన్నా ఎక్కువ హోదాలో ఉంటారు. త్రివిధ దళాధిపతులతో కూడిన 'చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ'కి శాశ్వత ఛైర్మన్‌గా ఉంటారు.
  • సైనిక వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహిస్తారు.
  • త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా ఉంటారు. అయితే విడివిడిగా తమ దళాలకు సంబంధించిన అంశాలపై మాత్రం ఆయా దళాల అధిపతులే రక్షణ మంత్రికి సలహాలిస్తారు.
  • సీడీఎస్‌కు త్రివిధ దళాలపైన, వాటి అధిపతులపై సైనికపరమైన అజమాయిషీ ఉండదు.
  • సైబర్‌, అంతరిక్షానికి సంబంధించిన విభాగాలతోపాటు త్రివిధ దళాల సంస్థలు సీడీఎస్‌ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అణ్వస్త్ర ప్రాధికార సంస్థ (న్యూక్లియర్‌ కమాండ్‌ అథారిటీ)కి సీడీఎస్‌ సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు.
  • రక్షణ మంత్రి నేతృత్వంలోని ఆయుధ కొనుగోళ్ల మండలిలో, జాతీయ భద్రతా సలహాదారు నాయకత్వంలోని రక్షణ ప్రణాళిక కమిటీలో సీడీఎస్‌ సభ్యుడిగా ఉంటారు.
  • సాధన సంపత్తి కొనుగోళ్లలో త్రివిధ దళాలకు ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించాలి.
  • సీడీఎస్‌ పదవిని చేపట్టే అధికారి తన పదవీ విరమణ అనంతరం ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టరాదు. అనుమతి లేకుండా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరకూడదు.
Last Updated : Sep 28, 2022, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details