కరోనా.. లాక్డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్.. జూమ్ కాల్స్ మీటింగ్స్ పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇంట్లోనే ఉండి జూమ్కాల్స్లో పాల్గొంటున్న వారి వల్ల కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్య ఓ ఫ్రొఫెసర్ వీడియోకాల్లో జీఎస్టీపై ఎంతో సీరియస్గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన సతీమణి వచ్చి ముద్దు పెట్టబోయిన ఘటన నెట్టింట్లో హల్చల్ చేసింది. తాజాగా.. ఓ న్యాయవాది జూమ్కాల్ కొనసాగుతుండగానే భోజనం చేస్తూ ఏకంగా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కంటపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
జూమ్కాల్లో భోజనం.. విస్తుపోయిన సొలిసిటర్! - ఎస్జీఐ జూమ్కాల్ సరదా
ఓ కేసు విచారణలో భాగంగా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా సమక్షంలో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు ఓ న్యాయవాది. అయితే.. తన వాదనలు పూర్తయిన తర్వాత కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయి ప్లేట్ పట్టుకుని భోజనం చేయడం మొదలు పెట్టారు. అది చూసిన తుషార్ మెహతా ఆశ్చర్యానికి గురయ్యారు. జూమ్కాల్లో ఉన్న మిగతా సభ్యులు ఆ న్యాయవాది చేసిన పనికి తెగ నవ్వుకున్నారు.
గతకొంత కాలంగా కోర్టు విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బిహార్లోని పట్నాకు చెందిన న్యాయవాది కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్జీఐ) తుషార్ మెహతా కూడా ఉన్నారు. అయితే, తన వాదనలు పూర్తయిన తర్వాత ఆ న్యాయవాది జూమ్కాల్ వీడియో ఆఫ్ చేయకుండా కెమెరా ముందే ప్లేట్ పట్టుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. అది చూసిన తుషార్ మెహతా విస్తుపోయారు. కెమెరా ఆన్లోనే ఉందని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, అది న్యాయవాదికి వినపడలేదు. చివరికి తుషార్ మెహతా అతడి పర్సనల్ ఫోన్కి కాల్ చేసి పరిస్థితి వివరించారు. దీంతో కంగుతిన్న న్యాయవాది ప్లేటు పక్కన పెట్టి.. బిక్కముఖం వేసుకొని కూర్చున్నాడు. ఎస్జీఐ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఆ భోజనం తనకూ పంపమని సరదాగా వ్యాఖ్యానించారు. మరోవైపు జూమ్కాల్లో ఉన్న మిగతా సభ్యులు న్యాయవాది చేసిన పనికి పగలబడి నవ్వారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..
ఇదీ చూడండి:'నేనో కోబ్రా.. ఒకే కాటుకు అంతం చేస్తా'