తెలంగాణ

telangana

ఆ రాష్ట్రంలో 15 రోజులు లతా మంగేష్కర్ పాటలే

By

Published : Feb 6, 2022, 8:12 PM IST

Lata Mangeshkar demise: దివంగత గాయని లతా మంగేష్కర్​కు వివిధ రాష్ట్రాలు ఘన నివాళులు అర్పించాయి. గాయని మృతి నేపథ్యంలో కర్ణాటకలో రెండు రోజులు సంతాప దినాలను పాటించనున్నారు. బంగాల్​లోని బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థలు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద 15 రోజుల పాటు లతాజీ పాటలను ప్రసారం చేయనున్నారు.

lata-mangeshkar-demise
lata-mangeshkar-demise

Lata Mangeshkar demise: సుప్రసిద్ధ గాయని, దివంగత లతా మంగేష్కర్​కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నివాళులు ప్రకటించాయి. ఆమె మృతికి నివాళిగా బంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థలు, ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద 15 రోజుల పాటు లతా మంగేష్కర్ పాటలను ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. లతా మంగేష్కర్​ గాత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆదరించారని దీదీ పేర్కొన్నారు. ఆమె పాటలు విని తాను సైతం మైమరచిపోయానని అన్నారు. బంగాల్ ప్రాంతంతో గాయనికి విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు.

లతా మంగేష్కర్..

సంతాప దినాలు

Karnataka Lata Mangeshkar demise: లతా మంగేష్కర్ మృతి పట్ల రెండు రోజుల సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు తెలిపింది కర్ణాటక ప్రభుత్వం. 48 గంటల పాటు జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచనున్నారు. ప్రజా వినోద కార్యక్రమాలపై నిషేధం ఉండనుంది. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు, ఉత్తరాఖండ్​లో ఒకరోజు సంతాప దినంగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

సెలవు

Lata Mangeshkar condolences: మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7న సెలవు ప్రకటించింది. గాయని మృతికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె మరణం సంగీత, కళా రంగానికి తీరని నష్టం కలిగిస్తుందని పేర్కొంది.

సీఎం, గవర్నర్ నివాళులు

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​.. గాయని మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. భారతీయులు, సంగీత ప్రేమికుల హృదయాల్లో ఆమె ఎప్పటికీ నిలిచే ఉంటారని గవర్నర్ రవి పేర్కొన్నారు. ఎనిమిది దశాబ్దాల వృత్తిజీవితంలో లతా మంగేష్కర్.. తన పాటలతో ప్రతి భారతీయుడి హృదయాలను స్పృశించారని స్టాలిన్ అన్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్​సల్వం, ఏఎంఎంకే లీడర్ టీటీవీ దినకరణ్, వీకే శశికళ సహా పలువురు ప్రముఖులు లతా మంగేష్కర్​కు నివాళులు అర్పించారు.

గాయని కన్నుమూత..

కరోనా బారినపడి కోలుకున్న లతా మంగేష్కర్.. ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొవిడ్​ అనంతరం 28 రోజుల పాటు ఆమె చికిత్స తీసుకున్నారని.. పలు అవయవాలు దెబ్బతినటం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి తన ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి:లత కన్నుమూత.. మోదీ, భాజపా కార్యక్రమాలు రద్దు

ABOUT THE AUTHOR

...view details