తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపావి నీచ రాజకీయాలు.. కశ్మీరీ పండిట్లకు రక్షణేదీ?' - kashmir pandits ncp

Kashmiri Pandits Kejriwal: కశ్మీర్​లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న హత్యలపై గళం విప్పారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. కశ్మీరీ పండిట్లు బలవంతంగా లోయను విడిచిపెట్టాల్సి వస్తోందని, కేంద్రం కశ్మీర్​ సమస్యను పరిష్కరించలేదని అన్నారు. పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రి అమిత్​ షా విఫలమయ్యారని ఎన్​సీపీ ఆరోపించింది.

Kashmiri Pandits forced to leave their homes, BJP can't handle Kashmir: Kejriwal
Kashmiri Pandits forced to leave their homes, BJP can't handle Kashmir: Kejriwal

By

Published : Jun 5, 2022, 2:27 PM IST

Kashmiri Pandits Kejriwal: కశ్మీర్​లో వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్రం స్పష్టమైన ప్రణాళికతో రావాలని అన్నారు. ఉగ్రదాడులతో.. కశ్మీరీ పండిట్లు బలవంతంగా తమ ఇళ్లను, లోయను విడిచిపెట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. 1990ల నాటి పరిణామాలు పునరావృతమవుతున్నాయని అన్నారు. పండిట్లపై లక్షిత దాడులకు వ్యతిరేకంగా.. దిల్లీ జంతర్​ మంతర్​లో ఆమ్​ ఆద్మీ పార్టీ నిర్వహించిన 'జన్​ ఆక్రోశ్​ ర్యాలీ'లో ఈ వ్యాఖ్యలు చేశారు దిల్లీ సీఎం.

జమ్ముకశ్మీర్​లో ఉగ్రకార్యకలాపాలు పెరగడానికి పాకిస్థాన్​ కారణమని ఆరోపించారు కేజ్రీవాల్​. కశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో అంతర్భాగమేనని, దుశ్చర్యలను మానుకోవాలని పాక్​కు హితవు పలికారు. భాజపా నీచమైన రాజకీయాలు చేస్తోందని, కశ్మీర్​ సమస్యను ఎదుర్కోలేదని తీవ్రవిమర్శలు చేశారు.

''కశ్మీర్​ సమస్యను తీర్చడం భాజపా తరం కాదు. వారికి నీచ రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. దయచేసి కశ్మీర్​పై రాజకీయాలు చేయొద్దు. కశ్మీర్​లో ఏదైనా హత్య జరిగితే.. హోం మంత్రి అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. మాకు మీటింగ్​లు వద్దు. చర్యలు కావాలి. కశ్మీర్​ కూడా అదే కోరుకుంటోంది. కశ్మీర్​ సమస్య పరిష్కారానికి కేంద్రం ఎలాంటి ప్రణాళిక రూపొందించిందో కేంద్రం.. ప్రజలకు తెలియజేయాలి. కశ్మీరీ పండిట్ల డిమాండ్లను నెరవేర్చాలి. వారికి సరైన భద్రత కల్పించాలి.''

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

కశ్మీర్​లో ఇటీవల ఉగ్రవాదుల లక్షిత దాడులు పెరిగిపోయాయి. లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు.. ఇటీవల 8 మందిని హత్య చేశాయి. ఇందులో ముస్లిమేతరులు, భద్రతా సిబ్బంది, సినీ నటి, సాధారణ పౌరులు ఉన్నారు. కశ్మీర్​ పండిట్​ వర్గం ప్రభుత్వ ఉద్యోగి రాహుల్​ భట్​ను మే 12న బుడ్గాంలో హత్యచేశారు ముష్కరులు. మే 18న వైన్​షాప్​పై దాడి చేసి.. ఒక వ్యక్తిని బలిగొన్నారు. మే 24న పోలీసు సిబ్బంది సైఫుల్లా ఖాద్రిని తన ఇంటి ఎదుటే చంపారు. రెండు రోజులకు టీవీ ఆర్టిస్ట్​ అమ్రీన్​ భట్​ను బుడ్గాంలో కాల్చివేశారు. మే 31న సాంబా జిల్లాలో మహిళా టీచర్​ను కాల్చిచంపారు. జూన్​ 2న రెండు వేర్వేరు ఘటనల్లో ఓ బ్యాంకు మేనేజర్​, మరో వలస కార్మికుడిని చంపారు.

కేంద్రం విఫలం: కశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది ఎన్​సీపీ. భారత పౌరుల భద్రతను చూడాల్సిన.. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కూడా పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు పార్టీ అధికార ప్రతినిధి మహేశ్​ తపసే. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కశ్మీర్​ ఫైల్స్​ సినిమాను ప్రచారం చేసుకోవడంలో తీరిక లేకుండా ఉందని భాజపాను విమర్శించారు.

ఇవీ చూడండి:'ద కశ్మీర్​ ఫైల్స్​' రిపీట్​.. హిందువులే లక్ష్యంగా ఉగ్ర దాడులు!

'జమ్ముకశ్మీర్​లో​ భారీగా కేంద్ర బలగాల మోహరింపు'

ABOUT THE AUTHOR

...view details