తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2021, 8:05 AM IST

ETV Bharat / bharat

కరిగిపోతున్న కశ్మీరం.. లక్షలాది మంది జీవనోపాధిపై ప్రభావం

ధవళ వర్ణంలో ఠీవిగా కాంతులీనే హిమశైలం మెల్లగా కరిగిపోతోంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే కశ్మీర్‌ అందాలు కనుమరుగవుతున్నాయి. అత్యంత వేగంగా కరిగిపోతున్న హిమానీనదాలు (Kashmir Glaciers Melting) ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గడిచిన రెండు దశాబ్దాల కాలంలోనే దాదాపు ఆరుకు పైగా భారీ హిమానీనదాలు అదృశ్యమయ్యాయంటే పరిస్థితి ఎంత ఆందోళకర స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ ప్రకృతి వైపరిత్యం స్థానికంగా ఉండే లక్షలాది మంది జీవనోపాధిపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.

Kashmir glaciers
కరిగిపోతున్న హిమానీ నదులు

కరిగిపోతున్న కశ్మీరం.. ప్రజల జీవనంపై ప్రభావం

ప్రకృతి సోయగాలకు నిలయమైన జమ్ముకశ్మీర్‌లోని హిమానీనదాలు (Kashmir Glaciers Melting) అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి.లక్షలాది మంది కశ్మీరీల జీవనోపాధిపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. కశ్మీర్‌ లోయలోని సోన్‌మార్గ్ సమీపంలో తాజివాస్ హిమానీనదం (Thajiwas Glacier kashmir) ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. చుట్టూ మంచుకొండలు, పచ్చిక బయళ్లు, జలపాతాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో హిమానీనదం అత్యంత వేగంగా కరిగిపోతోంది. గడిచిన మూడేళ్లలోనే ఈ భారీ హిమానీనదం దాదాపు 50 మీటర్లకు పైగా కరిగిపోయిందని కశ్మీర్‌ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ప్రొఫెసర్‌ ఇర్ఫాన్ రషీద్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న మార్పులతోనే హిమానీనదాలు కరిగిపోతున్నాయని ఆయన అన్నారు.

జమ్ముకశ్మీర్‌ ప్రాంతంలో 1980వ దశకం నుంచి దాదాపు ఆరు హిమానీనదాలు పూర్తిగా అదృశ్యమైనట్లు (Kashmir Glaciers Melting) ప్రొఫెసర్‌ ఇర్ఫాన్ రషీద్ చెప్పారు. ముఖ్యంగా 2000 సంవత్సరం తరువాతే నాలుగు హిమానీదాలు పూర్తిగా కరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దీని కారణంగా నీటి లభ్యత రోజురోజుకు తగ్గుముఖం పడుతోందని అన్నారు. ఇది స్థానికంగా నివసించే లక్షలాది ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వివరించారు. జమ్ముకశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలైన పర్యాటకం, వ్యవసాయంపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుందన్నారు. అనేక మంది స్థానిక రైతులు వరి సాగుకు స్వస్తి పలికి.. యాపిల్‌ సాగువైపు మోగ్గుచూపుతున్నారని చెప్పారు.

జమ్ముకశ్మీర్ ప్రాంతంలో దాదాపు 14,000 హిమానీనదాలు ఉన్నాయి. 1980 నుంచి దాదాపు ఆరు హిమానీనదాలు అదృశ్యమయ్యాయి. వాటిలో నాలుగు హిమానీనదాలు 2000 తర్వాత కనిపించకుండాపోయాయి. మారుతున్న వాతావరణం కారణంగా అవి అదృశ్యమవుతున్నాయి.

- ప్రొఫెసర్‌ ఇర్ఫాన్ రషీద్, కశ్మీర్‌ విశ్వవిద్యాలయం

హిమానీనదాలు వేగంగా కరుగుతుండడంతో (Kashmir Glaciers Melting) కశ్మీర్‌ ప్రాంతంలో నివసించేవారు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం హిమానీనదాలు ధవళ వర్ణంలో కాంతులీనుతూ ఉండడం తాను చూశానని ఎన్నో ఏళ్లుగా హిమాలయాలను నిశితంగా గమనిస్తున్న స్థానిక పశువుల కాపరి మహ్మద్‌ ఆయూబ్‌ తెలిపారు. గతంలో తాజివాస్‌ హిమానీనదం నుంచి ప్రారంభమైన ప్రవాహం కశ్మీర్‌ లోయ చివరి వరకు భారీ స్థాయిలో ప్రవహించేదని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఎన్నో హిమానీనదాలు తన కళ్ల ముందే కనుమరుగయ్యాయని ఆయూబ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పదేళ్లుగా మంచు ప్రవాహాలు , నీటి మట్టాలు తగ్గడాన్ని మనం చూస్తున్నాం. పాత రోజుల్లో, హిమానీనదం నుంచి ప్రారంభమయ్యే ప్రవాహం దట్టమైన మంచుతో కప్పబడి ఉండేది. ఇప్పుడు, అది మునుపటిలా లేదు. ఇప్పుడు నీరు తగ్గి, మంచు కూడా అదృశ్యమైంది.

-మహ్మాద్‌ ఆయూబ్‌, స్థానిక పశువుల కాపరి

జమ్ముకశ్మీర్‌ యాపిల్‌ తోటలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా యాపిల్‌ ఉత్పత్తిలో దాదాపు 80శాతానికి పైగా జమ్ము కశ్మీర్‌లోనే పండిస్తున్నారు. అయితే హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం (Kashmir Glaciers Melting) యాపిల్ పంటపై కూడా ప్రభావాన్ని చూపాయని స్థానికంగా యాపిల్‌ సాగు చేసే రైతు మహమ్మద్ మక్బూల్ భట్ తెలిపారు.గతంలో పండ్ల తోటకు అన్నివైపులా నీటి ప్రవాహాలు, ఉండేవని చెప్పారు. కానీ ప్రస్తుతం నీటి కోరతతో బోరుబావులు తవ్వే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాత రోజుల్లో, నేను ఆపిల్ తోటను సాగు చేసినప్పుడు, తోటకి అన్ని వైపులా వాగులు, కాలువలు ఉండేవి. కానీ రోజులు గడిచే కొద్దీ నీటి మట్టం తగ్గి కాలువలు ఎండిపోయాయి. నీటిపారుదల కొరకు ప్రత్యామ్నాయ మార్గంగా బోరుబావి కోసం ప్రయత్నించాం. కానీ అది ఖరీదైనది, జనరేటర్‌ సౌకర్యం కూడా ఉండాలి. అయినప్పటికీ నీటిపారుదల సరిపోదు.

-మహమ్మద్‌ మక్బూల్‌ భట్, యాపిల్‌ సాగు రైతు

ఇదీ చూడండి:ఈ నెల 7న తెరుచుకోనున్న శిరిడీ సాయిబాబా ఆలయం

ABOUT THE AUTHOR

...view details