తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాశీ-తమిళ సంగమంతో 'ఏక్​ భారత్​ శ్రేష్ఠ్​​ భారత్'కు మరింత బలం: మోదీ - కాశీ తమిళ సంగమం 2023

Kashi Tamil Sangamam 2023 : ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో ఏర్పాటు చేసిన కాశీ-తమిళ సంగమం 2.0 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఏక్​ భారత్​ శ్రేష్ఠ్​​ భారత్​ భావనను కాశీ తమిళ సంగమం మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

kashi tamil sangamam 2023
kashi tamil sangamam 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 9:22 PM IST

Kashi Tamil Sangamam 2023 : ఏక్​ భారత్​ శ్రేష్ఠ్​​ భారత్​ భావనను కాశీ తమిళ సంగమం మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నూతన పార్లమెంట్​ భవనంలోకి ప్రవేశించగానే ఈ భావన కనిపిస్తుందని చెప్పారు. అధికారిక మార్పిడికి గుర్తుగా భావించే సెంగోల్​ను కొత్త పార్లమెంట్​ భవనంలో ప్రతిష్ఠించామని గుర్తు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో ఏర్పాటు చేసిన కాశీ తమిళ సంగమం 2.0 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. తమిళనాడు, కాశీ ప్రజల మధ్య ఉన్న సంబంధం ప్రత్యేకమైనదని తెలిపారు. బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం, ఐఐటీ మద్రాస్​ భాగస్వామ్యంగా ఏర్పడి ఈ కాశీ-తమిళ సంగమాన్ని విజయవంతం చేయడాన్ని ప్రశంసించారు.

కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తొలిసారిగా కృత్రిమ మేధతో భాషను తర్జుమా చేసే 'భాషిణి' విధానాన్ని ఉపయోగించారు. దీని ద్వారా ప్రధాని మోదీ హిందీలో చేసిన ప్రసంగాన్ని అక్కడి తమిళ శ్రోతలు తమ మాతృభాషలో విన్నారు. అంతకుముందు వారణాసి నుంచి కన్యాకుమారి వరకు నడిచే కాశీ తమిళ సంగమం ఎక్స్​ప్రెస్​ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ ఇతర నేతలు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా ఏక్​ భారత్​ శ్రేష్ఠ్ భారత్​ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 17 నుంచి 30 మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. బుధవారం జరిగిన కార్యక్రమానికి సుమారు 1,400 మంది అతిథులు హాజరయ్యారు.

కాన్వాయ్​ను పక్కకు మళ్లించి అంబులెన్స్​కు దారి
మరోవైపు, తన కాన్వాయ్‌ను పక్కకు మళ్లించి అంబులెన్స్‌కు దారి ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో మోదీ పాల్గొన్నారు. ఓవైపు రోడ్‌షో కొనసాగుతుండగా అటువైపుగా అంబులెన్స్‌ రావడం గుర్తించిన మోదీ, భద్రతా అధికారులకు కాన్వాయ్‌ను రోడ్డు పక్కకు మళ్లించాలని సూచించారు. అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్‌ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దీనిపై ప్రధానిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని అంబులెన్స్‌కు ఇలా దారి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అహ్మదాబాద్‌, హిమాచల్‌ప్రదేశ్‌ పర్యటన సందర్భంగా మోదీ తన కాన్వాయ్‌ను ఆపి మరీ అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

ప్రపంచ వజ్రాల కేంద్రంగా భారత్- సూరత్ డైమండ్ మార్కెట్​ ఒక మోదీ గ్యారంటీ! : ప్రధాని మోదీ

ప్రాచీన సంస్కృతి పునరుద్ధరణే లక్ష్యంగా.. కాశీ తమిళ సంగమ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details