కర్ణాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మైసూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్, మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ దాసరి రోహిణీ సింధూరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు బదిలీల వరకు వెళ్లాయి. ప్రభుత్వం ఇద్దరిపై చర్యలు తీసుకున్నా.. గత కొద్ది రోజులుగా ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
అసలేమైందంటే?
దాసరి రోహిణి సింధూరి తనను ప్రతి విషయంలో అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారంటూ శిల్పా నాగ్ ఆరోపణలు చేశారు. తనను విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. జిల్లా యంత్రాంగం తనకు సహకరించడం లేదని పేర్కొన్నారు. పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
"ఓ ఐఏఎస్ అధికారి హోదాలో మరో అధికారిని సింధూరి అణచివేస్తున్నారు. ఆమె నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె మనస్తత్వం సరిగ్గా లేదు. తను మైసూరులో ఉండాల్సింది కాదు. ఆమె నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలీదు. నేను రాజీనామా చేసి వేరే జీవితాన్ని ఆస్వాదిస్తాను."
-శిల్పా నాగ్, ఎంసీసీ కమిషనర్
సింధూరి వివరణ
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను సింధూరి ఖండిస్తున్నారు. శిల్పా నాగ్ వ్యాఖ్యలు వాస్తవ దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. పది రోజుల నుంచి జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా శిల్పా నాగ్.. ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పారు. అలాంటి వైఖరి ఎంసీసీ కమిషనర్ స్థాయి వ్యక్తి నుంచి ఊహించలేదని అన్నారు. తను నిర్వహించే కరోనా సమీక్ష సమావేశాలకు సైతం శిల్ప హాజరు కావడం లేదని తెలిపారు.
"కొత్త కరోనా కేసులకు సంబంధించి వార్డులు వారీగా ఎంసీసీ సమర్పించే వివరాలు అసంబద్ధంగా ఉన్నాయి. సంతకం లేకుండానే ఈ నివేదిక పంపిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని నేను ఆదేశించాను. ప్రైవేటు పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్ఆర్ ఫండ్స్కు ఎంసీసీ కమిషనర్ ఇంఛార్జిగా ఉన్నారు. ఈ నిధులు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సంబంధించినవి. కానీ వీటిని ఒక్క మైసూరు నగరానికే వినియోగించారని నా దృష్టికి వచ్చింది. తాలుకాలు, గ్రామీణ ప్రాంతాలకు నిధులు అందించనేలేదు. ఇది సరైనది కాదు. దీనికి సంబంధించి జూన్ 1 వరకు ఉన్న వివరాలను ఇవ్వాలని ఆమెను అడిగాను. ఇలాంటి చర్యలు ఎలా వేధింపులకు గురిచేసినట్లు అవుతాయి? ఎలా ఊహించుకున్నా.. ఇవి ఆ కోవలోకి రావు."