కరెన్సీ నోట్ల కట్టలను నడుముకు చుట్టుకుని, అక్రమంగా నగదును రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. బైక్పై వెళుతున్న వారిని.. పోలీసులు ఆపి తనిఖీ చేయగా అసలు విషయం తెలిసింది. వారి నుంచి మొత్తం రూ.7.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేస్తుండంగా నిందితులు పట్టుబడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దావణగెరె జిల్లాలో బుధవారం రాత్రి నిందితులు దొరికారని పోలీసులు తెలిపారు. నిందితులను సైఫుల్లా, కుమార్గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు షిమోగా జిల్లాలోని షికారిపుర్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకుని.. వాటిని సీజ్ చేసినట్లు వారు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
కర్ణాటక ఎన్నికల సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి అక్రమంగా నగదు, మద్యం సరాఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే బుధవారం రాత్రి కూడా న్యామతి తాలూకాలోని జీనహళ్లి చెక్పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడికి సైఫుల్లా, కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చారు. వారి ప్రవర్తన అనుమానస్పదంగా ఉన్న కారణంగా పోలీసులు వారిని క్షణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వారి నడుముకు నగదు కట్టలను కట్టుకోవడాన్ని గుర్తించారు. నగదు ఎక్కడిది అని పోలీసులు వారిని ప్రశ్నించగా.. నిందితులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆధారాలు సైతం చూపించలేకపోయారు. దీంతో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.