తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2021, 5:27 AM IST

ETV Bharat / bharat

యడియూరప్ప దిల్లీ పర్యటన.. నాయకత్వ మార్పుకు సూచన!

కర్ణాటక ముఖమంత్రి యడియూరప్ప ఆకస్మిక దిల్లీ పర్యటనతో నాయకత్వం మర్పుపై మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన కమలం పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలు నాయకత్వ మార్పు కచ్చితంగా ఉంటుందనే వాదనకు ఊతమిస్తున్నాయి.

Yediyurappa
యడియూరప్ప

కర్ణాటకలో నాయకత్వ మార్పులు జరుగుతాయనే ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప ఆకస్మిక దిల్లీ పర్యటన దీనికి మరింత ఊతమిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో సీఎం యడియూరప్ప హస్తినకు బయల్దేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పార్టీ నాయకత్వ మార్పుపై చర్చించేందుకే అధిష్ఠానం యడ్డీని దిల్లీకి పిలిపించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలతోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎంపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో సీఎం తనయుడి జోక్యం ఎక్కువైపోతోందని, ఫలితంగా ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతోందని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్పతో మాట్లాడి.. నిర్ణయం తీసుకునేందుకే ఆయన్ను దిల్లీకి పిలిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఈ వాదనలను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్ కొట్టిపారేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఓ ముఖ్యమంత్రి ప్రధానిని కలవడం సహజమేనని, కావేరీ నదీ జలాల అంశంపై చర్చించేందుకే సీఎం దిల్లీ వెళ్లారని ఆయన వెల్లడించారు. కావేరి నదిపై మేకెదాటు వద్ద కర్ణాటక ఓ నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల తమ రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతుందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకే యడియూరప్ప దిల్లీ వెళ్లారని అశోక్‌ వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో రాష్ట్ర మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:సోనియాతో సిద్ధూ భేటీ- పంజాబ్​ పీఠం దక్కేనా?

ABOUT THE AUTHOR

...view details