Karnataka CM Change: కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పలు వివాదాలు వచ్చే ఏడాది జరగబోయే శాసన సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలతో సీఎం బసవరాజు బొమ్మైను మార్చాలని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బెంగళూరు పర్యటన ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది.
ఇటీవల హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్ వంటి వివాదాలు కర్ణాటకను కుదిపేశాయి. దీనికి తోడు ఓ గుత్తేదారు ఆత్మహత్య వ్యవహారంలో రాష్ట్ర మంత్రిపై ఆరోపణలు రావడం బొమ్మై సర్కారును ఇరుకున పడేసింది. 2023లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదాలు భాజపాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బొమ్మైను మార్చి ఆయన స్థానంలో మరొకరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల పార్టీ జాతీయ సెక్రటరీ బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు.. ఈ ఊహాగానాలకు తెరలేపాయి. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం భాజపా అధిష్ఠానానికి ఉందని సంతోష్ అన్నారు. గుజరాత్లో చేసినట్లుగానే కర్ణాటకలోనూ మార్పులు చేసే అవకాశముందని సూచన ప్రాయంగా వెల్లడించారు. దీంతో బొమ్మై సీటు నుంచి దిగడం ఖాయమని వార్తలు వెలువడుతున్నాయి.