రాష్ట్రపతి భవన్లోని పద్మ అవార్డుల ప్రదానోత్సవం సమయంలో తులసి గౌడ అని పేరు పిలవగానే.. సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ వస్తుంటే.. దర్బార్ హాల్లోని కళ్లన్నీ ఆమెవైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాయి. ఆమెను చూడగానే అడవి తల్లికి ఆడబిడ్డ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఏ క్షణాన ఆమెకు 'తులసి' అని పేరుపెట్టారో గానీ, ఆ పేరుకు తగ్గట్లుగా ఆమె జీవితం కూడా ప్రకృతితో మమేకమైంది. సాధారణంగా రాణులు కోటలు కడతారు.. కానీ కర్ణాటకకు చెందిన ఈ మనసున్న మారాణి తులసి మాత్రం ప్రత్యేకమైన కోటను నిర్మించింది. ఏకంగా 40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే సృష్టించింది. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే.. పద్మశ్రీ అవార్డును తెచ్చిపెట్టింది. ఎంతో మంది ప్రముఖుల మధ్య సోమవారం ఆమె దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆ పెద్దావిడను చూడగానే మోదీ కూడా ఎంతో గౌరవంగా ప్రతినమస్కారం చేయడం అక్కడున్న అందర్నీ ఆకర్షించింది.
చెట్లతో అనుబంధం..
కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడ.. హలక్కీ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. దీంతో పూట గడవడానికి రోజూ తల్లితో కలిసి కూలీకి వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమవడంతో తులసికి చదవడం, రాయడం రాదు. 10-12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు ఆమె ఎప్పుడూ కుంగిపోయేది. దీని నుంచి బయటపడటానికి నిత్యం దగ్గర్లోని అడవిలో గడిపేది. అక్కడి చెట్లే ఆమెకు ఓదార్పునిచ్చేవి. ఆనందాన్నిచ్చేవి. అలా ఆమెకు అడవితో బంధం ఏర్పడింది.
40వేలకు పైగా మొక్కల్ని పెంచి..