MP Avinash Approached Supreme: ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు అవినాష్ రెడ్డి.. దక్కని ఊరట - Avinash Reddy Approached Supreme Court
![MP Avinash Approached Supreme: ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు అవినాష్ రెడ్డి.. దక్కని ఊరట MP Avinash Approached Supreme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18523693-1058-18523693-1684298711711.jpg)
10:12 May 17
హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ను విచారించేలా ఆదేశించాలని పిటిషన్
MP Avinash Approached Supreme Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ను విచారించేలా ఆదేశించాలని కోరారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సీజేఐ ధర్మాసనం ముందు అవినాష్ తరఫు లాయర్లు ఈరోజు మెన్షన్ చేశారు. అయితే అవినాష్కు సుప్రీంలో ఊరట దక్కలేదు. విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఇంకా ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమైతే రాత పూర్వక అభ్యర్థన ఇవ్వాలని.. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు.
మంగళవారం నాడు పలు నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. వివేకా హత్య కేసులో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా అవినాష్రెడ్డికి సోమవారం సాయంత్రం సీఆర్పీ 160 సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్లోనే ఉన్న అవినాష్ రెడ్డి.. విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు. షార్ట్ నోటీసు ఇచ్చినందున విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. నాలుగు రోజుల గడువు కావాలని.. ఆ తర్వాత ఎప్పుడు రమ్మన్నా విచారణకు హాజరవుతానని తెలిపారు. హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లారు. అవినాష్ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని.. మరోసారి నోటీసులు పంపింది. ఈలోగా అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెరపైకి వస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి: