Inflation rate in India: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ మరో శ్రీలంకలా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. "దేశ ప్రజలను మభ్యపెట్టడం.. నిజాలను మార్చదు. భారత్ చాలా వరకు శ్రీలంక మాదిరిగా కనిపిస్తోంది." అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు రాహుల్. నిరుద్యోగం, పెట్రోల్ ధరలు, మతపరమైన హింస వంటి అంశాలపై ఇరు దేశాలను పోల్చుతూ ఓ గ్రాఫిక్ చిత్రాన్ని షేర్ చేశారు.
రోజువారీ అవసరాల కోసం రుణాలు: ధరల పెరుగుదలను సూచిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆదాయం పెంచేందుకు భాజపా ప్రభుత్వం కనీసం ఒక్క పాలసీని తీసుకురాలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఓ మీడియా కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు ప్రియాంక. ప్రజల కష్టార్జితాన్ని ద్రవ్యోల్బణం హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చుల కోసం రుణాలు తీసుకోవాల్సి వస్తుందేమోనని పేద ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు.
మమతా బెనర్జీ విమర్శలు:గృహ అవసరాల గ్యాస్, చమురు ధరల పెంపుపై విమర్శలు గుప్పించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. ధరల పెరుగుదల వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మతపరమైన కలహాలు సృష్టిస్తోందన్నారు. 'డొమెస్టిక్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సాధారణ ప్రజలను కేంద్రం దోచుకుంటోంది. వీటిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మతపరమైన అల్లర్లు సృష్టిస్తోంది.' అని మెదినీపుర్ కళాశాల మైదానంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు మమత.
దృష్టి మరల్చేందుకే: దేశంలోని పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు భాజపా మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. అది దేశాన్ని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. ఒక మతానికి సంబంధించిన ప్రాంతాల పేర్లను మార్చటం విద్వేషాన్ని పెంచుతుందనన్నారు. 'దీంతో ఏ క్షణమైనా దుర్భర పరిస్థితులుగా మారొచ్చు. స్వతంత్రం వచ్చిన దశాబ్దాల తర్వాత జ్ఞాన్వాపీ, మథుర, తాజ్మహల్ వంటి ఇతర ప్రాంతాలపై జరుగుతున్న కుట్రలతో ప్రజల మతపరమైన నమ్మకాలను దెబ్బతీయటం.. దేశాన్ని బలపరచదు.. మరింత దిగజార్చుతుంది. భాజపా ఈ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. వారణాసిలోని జ్ఞాన్వాపీ మసీదు, శ్రీకృష్ణుడి జన్మస్థానం మథుర, తాజ్మహల్లోని 22 గదులు తెరవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు మాయావతి.
ఇదీ చూడండి:'పెట్రోల్ ధర.. శ్రీలంక, పాకిస్థాన్ కంటే భారత్లోనే ఎక్కువ'