కొవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి వేగాన్ని తెలియజెప్పే ఆర్-ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేట్) దేశంలో క్రమేపీ పెరుగుతోంది. ఇది 1కి చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా కేరళతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మెట్రో నగరాలైన పుణె, దిల్లీల్లోనూ ఆర్-ఫ్యాక్టర్ పెరుగుతున్నట్లు చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు.
మళ్లీ పెరుగుదల..
దేశంలో కొవిడ్ రెండో ఉద్ధృతి అత్యంత తీవ్రదశలో ఉన్నప్పుడు (మార్చి 9 - ఏప్రిల్ 21 మధ్య) ఆర్-ఫ్యాక్టర్ 1.37గా ఉండేది. అనంతరం క్రమేపీ తగ్గుతూ మే 15 - జూన్ 26 మధ్య కాలంలో 0.78కి చేరింది. జులైలో మళ్లీ పెరుగుదల మొదలైంది. జులై 3 - 22 మధ్య ఇది ఏకంగా 0.95కి పెరగడం ఆందోళనకరం. కొవిడ్ బారిన పడిన వారి నుంచి వైరస్ ఇతరులకు సంక్రమించే తీరును ఆర్-ఫ్యాక్టర్ తెలుపుతుంది. ఉదాహరణకు ఇది 0.95 ఉందంటే.. కొవిడ్ సోకిన ప్రతి 100 మంది ద్వారా ఇన్ఫెక్షన్ మరో 95 మందికి సోకుతుందని అర్థం. అదే 1 దాటితే పరిస్థితి తీవ్రమవుతుంది. కేరళలో ఆర్-ఫ్యాక్టర్ ఏకంగా 1.11 ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మణిపుర్ మినహా మిగిలిన అన్నిచోట్ల 1 దాటింది. మణిపుర్లో కూడా 1కి చేరువగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరాఖండ్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో వచ్చే రెండు వారాల్లో కొవిడ్ వ్యాప్తి ఈ ప్రాంతాల్లో పెరిగే ప్రమాదం ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సితభ్ర సిన్హా తెలిపారు.
24 గంటల్లో 43,509 మందికి కొవిడ్