తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉపరాష్ట్రపతి పోలింగ్.. ఓటేసిన మోదీ.. మళ్లీ వీల్​ఛైర్​లోనే మన్మోహన్ - VICE PRESIDENT POLL

Vice president election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్​సభ, రాజ్యసభ ఎంపీలు ఓటేసేందుకు లైన్లలో నిల్చున్నారు.

VICE PRESIDENT POLL
VICE PRESIDENT POLL

By

Published : Aug 6, 2022, 10:01 AM IST

Updated : Aug 6, 2022, 11:00 AM IST

Vice president polling: భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు. లోక్​సభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగుతుంది. ఎన్డీయే కూటమి తరఫున బంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్‌ మార్గరెట్‌ ఆళ్వా (80) ఉపరాష్ట్రపతి బరిలో ఉన్నారు.

ఓటు వేస్తున్న మోదీ

పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్వినీ వైష్ణవ్ సహా పలువురు ఎంపీలు, మంత్రులు ఓటేశారు. ఎంపీలు ఓటేసేందుకు పోటెత్తారు. మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ ఎంపీ మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ఆయన వీల్​ఛైర్​లో పార్లమెంట్​కు వచ్చారు. ఆయనకు సిబ్బంది సహకరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆయన వీల్​ఛైర్​లోనే వచ్చి ఓటేయడం గమనార్హం.

వీల్​ఛైర్​లో వచ్చిన మన్మోహన్ సింగ్
లైన్లో నిల్చున్న ఎంపీలు

ఈ ఎన్నికకు సంబంధించి.. లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్‌ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్‌ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే నికరంగా 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినందున ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది.

ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున అధికారిక కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌కఢ్‌ గెలుపు దాదాపు లాంఛనమే. అధికార భాజపాకు లోక్‌సభలో 303, రాజ్యసభలో 91 కలిపి 394 ఓట్లున్నాయి. అభ్యర్థి గెలుపునకు కావాల్సిన 372+1కి మించిన ఓట్లు భాజపా ఒక్కదాని చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆపార్టీకి అదనంగా శివసేన, జనతాదళ్‌ (యూ), బీఎస్పీ, బీజేడీ, ఏఐఏడీఎంకె, వైకాపా, తెదేపా, శిరోమణి అకాళీదళ్‌, ఎల్‌జేపీ, ఏజీపీ, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, ఎంఎన్‌ఎఫ్‌, ఎస్‌కేఎం, ఎన్‌డీపీపీ, ఆర్‌పీఐ-ఎ, పీఎంకె, అప్నాదళ్‌, ఏజేఎస్‌యు, టీఎంసీ-ఎం మద్దతిస్తున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమికి 544 ఓట్లు లభించే సూచనలున్నాయి. అంటే ఎలక్టోరల్‌ కాలేజీలో 73% ఓట్లు ధన్‌ఖడ్‌కు దక్కే అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో అధికారకూటమి అభ్యర్థి వెంకయ్యనాయుడికి 67.89% ఓట్లు దక్కగా, ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 32.11% వచ్చాయి. ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ప్రధానమైన టీఎంసీ గైరుహాజరుకావడంవల్ల ఆ కూటమి ఓట్లకు ఆమేరకు కోతపడి, అధికార కూటమి అభ్యర్థి బలాన్ని పెంచుతోంది.

11న ప్రమాణస్వీకారం
ఈనెల 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. కొత్త ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ రోజు రాఖీపౌర్ణమి సెలవురోజైనప్పటికీ యథావిధిగా ఆ కార్యక్రమం కొనసాగనుంది. 12వ తేదీవరకు పార్లమెంటు జరుగనున్నందున చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.

Last Updated : Aug 6, 2022, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details