తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆరోగ్య భారతం.. పదేళ్లలో రికార్డు స్థాయికి వైద్యుల సంఖ్య'

PM Modi: భారత్‌లో పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు తయారవుతారని అని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసి.. అందరికీ వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఆయన చెప్పారు. గుజరాత్‌లోని భుజ్‌లో నిర్మించిన 200 పడకల కేకే పటేల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని శుక్రవారం దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు మోదీ.

By

Published : Apr 15, 2022, 2:26 PM IST

PM Modi
PM Modi

PM Modi Gujarat KKP Hospital: దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంతో రాబోయే పదేళ్లలో భారత్​.. రికార్డు సంఖ్యలో వైద్యులను కలిగి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని భుజ్‌లో 200 పడకల కేకే పటేల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని దిల్లీ నుంచి వర్చువల్​గా ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. భూకంప ప్రభావాన్ని ఎదుర్కొన్న భుజ్‌.. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో కొత్త చరిత్రను లిఖిస్తోందని మోదీ తెలిపారు.

"రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో సుమారు 1,100 ఎంబీబీఎస్ సీట్లతో తొమ్మిది వైద్య కళాశాలలు ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఎయిమ్స్​తో పాటు 36 వైద్య కళాశాలలు ఉన్నాయి. గతంలో గుజరాత్‌లోని మెడికల్ కాలేజీల్లో 1,000 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందేవారు. ప్రస్తుతం ఈ కాలేజీల్లో దాదాపు 6,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాజ్‌కోట్‌లో ఉన్న ఎయిమ్స్‌ కళాశాలలో 2021 నుంచి 50 మంది విద్యార్థులను చేర్చుకుంటున్నారు."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

క‌రోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని, ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని మోదీ సూచించారు. యోగా, ఆయుర్వేదానికి భారతదేశంలోనే మూలాలు ఉన్నాయని తెలిపారు. మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా యోగా, ఆయుర్వేదం వైపే మొగ్గు చూపారని, ప్రజలంతా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భారత్​​ నుంచి పసుపు ఎగుమతి పెరిగిందని ఆయన అన్నారు.

"జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో కచ్‌లో ఉన్న ప్రజలు అత్యధికంగా పాల్గొని ఆరోగ్యకరమైన జీవన సందేశాన్ని అందరికీ తెలియజేయాలి. దేశంలోని పర్యటక రంగ అభివృద్ధికి విదేశాల్లో ఉంటున్న కచ్ ప్రజల సహాయాన్ని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కచ్​ ప్రజలు ఏటా కనీసం ఐదుగురు విదేశీయులను ఐక్యతా విగ్రహాన్ని సందర్శించేలా చూడాలి. ఇలా చేయడం వల్ల పర్యటకం అభివృద్ధి చెందుతుంది. ఆటోడ్రైవర్లు, టీ అమ్మేవారు కూడా జీవనోపాధి పొందుతారు."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి జిల్లాలో 75 సరస్సులను నిర్మించాలని మోదీ పిలుపునిచ్చారు. కచ్ ప్రాంతంలో ప్రజలు నీటి కొరతను ఎదుర్కోకుండా కనీసం 75 పెద్ద సరస్సులను నిర్మించడంలో ప్రవాసులు సహకరించాలని కోరారు. కచ్‌లో ఇప్పుడు తగినంత నీరు, మేత అందుబాటులో ఉన్నందున వలస వెళ్లాల్సిన అవసరం లేదని మల్ధారీలకు(పశువుల పెంపకదారులు) అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. ఇలా వలసలు వెళ్తే చదువుకునే పిల్లలు చాలా ఇబ్బంది పడతారని ఆయన అన్నారు.

ఇవీ చదవండి:అర్జీలే అస్త్రంగా.. ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం

'ఒక్కరికి కరోనా సోకినా స్కూల్​ మొత్తం మూసేయాల్సిందే!'

ABOUT THE AUTHOR

...view details