ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(UN Human Rights Council) వేదికగా పాకిస్థాన్కు చురకలంటింటింది భారత్. ఉగ్రవాదులకు పాకిస్థాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోందని, వారికి ఆర్థికంగా సాయం చేస్తోందని ఆరోపించింది. ఐరాస జాబితాలో ఉన్న ఉగ్రవాదులు సహా ఇతర ముష్కరులకు అండగా నిలవడం పాక్ ప్రభుత్వ విధానంగా ఉందని విమర్శించింది.
సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు సహా మైనార్టీల హక్కుల పరిరక్షణలో పాక్ విఫలమైందని భారత్ ఆరోపించింది. మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది మహిళలు, బాలికలు అపహరణ, బలవంతపు పెళ్లిళ్లు, మత మార్పిడులకు గురి అవుతున్నట్లు తెలిపింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమే కాకుండా శక్తివంతమైందని గుర్తు చేసింది. పాకిస్థాన్ను ఓ విఫలమైన దేశంగా అభివర్ణించిన భారత్... అటువంటి దేశం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో తాము లేమని పేర్కొంది.