తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 12:53 PM IST

Updated : Dec 22, 2023, 2:03 PM IST

ETV Bharat / bharat

'ద్వేషాన్ని వ్యాపింపజేసే బీజేపీ- ప్రేమను పంచే 'ఇండియా' కూటమి'- విపక్షాల నిరసనలో రాహుల్

India Alliance Protest Over MPs Suspension : ఎంపీలను సస్పెండ్​ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 60 శాతం భారతీయుల గొంతు నొక్కిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ద్వేషం వ్యాపింపజేస్తే, ఇండియా పార్టీలు ప్రేమను పంచుతాయన్నారు. ఎంపీల సస్పెన్షన్​పై విపక్ష ఇండియా కూటమి దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద చేపట్టిన నిరసన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

India Alliance Protest Over MPs Suspension
India Alliance Protest Over MPs Suspension

India Alliance Protest Over MPs Suspension :పార్లమెంటులో విపక్ష ఎంపీలను ఎంపీలను బయటకు పంపించి ప్రభుత్వం 60 శాతం మంది భారతీయుల గొంతు నొక్కిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ఎంత ద్వేషం వ్యాపింపజేస్తే, ఇండియా పార్టీలు అంత ప్రేమను పంచుతాయన్నారు. 146మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద ఆందోళనలకు చేపట్టిన సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

" ఇద్దరు ముగ్గురు యువకులు పార్లమెంటులోకి ప్రవేశించి పొగను విడుదల చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు పారిపోయారు. ఈ సంఘటనలో భద్రతా ఉల్లంఘనపై ప్రశ్న తలెత్తుతోంది. దీంతోపాటు వారు ఈ విధంగా ఎందుకు నిరసన తెలిపారు? అనే ప్రశ్న ఎదురవుతోంది. దేశంలో నిరుద్యోగమే సమాధానం. దేశంలో నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడలేదు. కానీ సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ బయట కూర్చున్న వీడియోను రాహుల్​ గాంధీ రికార్డ్​ చేస్తే, దాని గురించి మాట్లాడింది"
--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

మమ్మల్ని భయపెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు : ఖర్గే
నిరసన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. 'మనం (ఇండియా కూటమి) కలిసికట్టుగా పోరాడాలి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా మనల్ని భయపెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి వాటికి కాంగ్రెస్ భయపడదు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నందున కూటమి పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. మీరు (బీజేపీ) ఎంతగా మమ్మల్ని తొక్కాలని ప్రయత్నిస్తున్నారో, మేము అంతగా పైకి లేస్తాం. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము ఐక్యంగా పోరాడుతాం. మేమందరం కలిసికట్టుగా ఉంటే నరేంద్ర మోదీ ఏం చేయలేరు' ఖర్గే విమర్శించారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు : శశి థరూర్​
ఎంపీల సస్పెన్షన్​పై మిగతా కాంగ్రెస్ ఎంపీలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతునొక్కి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న తీరును ప్రజలకు చూపిస్తున్నామని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్‌ షా నుంచి వివరణ కోరినందుకు ఇంతమంది ఎంపీలను సస్పెండ్‌ చేశారని మరో నేత దిగ్విజయ సింగ్‌ వివరించారు. ఐదారుగురిని సస్పెండ్‌ చేయడం వల్ల నష్టమేం లేదని కానీ ఇలా 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తే పార్లమెంట్​ ఎలా పనిచేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ అజారుద్దీన్‌ ప్రశ్నించారు. బీజేపీ చెప్పినట్లు సభ ఉల్లంఘనలు జరగలేదనీ, ఒక ఎంపీకి తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుందని వివరించారు.

అప్రజాస్వామ్యయుతంగా, నిరంకుశంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఇంతమంది ఎంపీలను సస్పెండ్‌ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్‌ ఎంపీ నసీర్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, అన్ని జాతీయవాద సంస్థలు ఏకతాటిపైకి రావాలని మరో ఎంపీ మనీశ్‌ తివారీ విజ్ఞప్తి చేశారు.

'ప్రజాస్వామ్యాన్నే సస్పెండ్ చేశారు- నియంతృత్వానికి ఇది పరాకాష్ఠ'- మోదీ సర్కారుపై విపక్షాలు ఫైర్

'కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోంది'- సస్పెన్షన్​ వేటుపై పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీల నిరసన

Last Updated : Dec 22, 2023, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details