తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంకు పోటీగా హత్యాచార బాధితురాళ్ల తల్లి - కేరళలో సీఎంకు పోటీగా మహిళ

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మదాం నియోజకవర్గ పోరు ఆసక్తి కరంగా మారింది. కేరళ సీఎం పినరయి విజయన్ పోటీ చేస్తున్న ఈ స్థానం నుంచి 2017 నాటి హత్యాచార బాధితురాళ్ల తల్లి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని విపక్ష కాంగ్రెస్‌ స్వాగతించింది. యూడీఎఫ్‌ పార్టీలతో సంప్రదించి ఈ స్థానంలో పోటీ చేయాలా? లేక ఆమెకే మద్దతు ప్రకటించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

In quest for justice, mother of slain girls to contest against Pinarayi Vijayan
సీఎంకు పోటీగా హత్యాచార బాధితురాళ్ల తల్లి

By

Published : Mar 16, 2021, 8:58 PM IST

కేరళలో ధర్మదాం నియోజకవర్గ పోరు రసవత్తరంగా మారింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలని సీఎం పినరయి విజయన్ వ్యూహాలు రచిస్తున్నారు. 2016లో ధర్మదాం నియోజక వర్గం నుంచి విజయం సాధించిన ఆయన.. ఈ ఎన్నికల్లోనూ అక్కడ నుంచే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. 2017లో సంచలనం సృష్టించిన వలయార్‌ అక్కాచెల్లెళ్ల హత్యాచారం కేసులో మృతుల తల్లి.. ధర్మదాంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

తన కుటుంబానికి అన్యాయం జరిగినపుడు సీఎం ఒక్కమాట కూడా మాట్లాడ లేదన్న మృతురాళ్ల తల్లి.. ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన కుమార్తెలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. సంఘ్ పరివార్ మినహా అందరి మద్దతూ తీసుకుంటానని చెప్పారు.

యూడీఎఫ్‌తో చర్చించాక..

ధర్మదాం నియోజక వర్గానికి విపక్ష యూడీఎఫ్‌ కూటమి ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయం సరైందేనని కేపీసీసీ అధ్యక్షుడు ముళ్లంపల్లి రామచంద్రన్ అన్నారు. యూడీఎఫ్‌తో చర్చించి ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భాజపా తరఫున సీకే పద్మనాభన్ ఇక్కడ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

ఏం జరిగింది?

2017లో వలయార్‌ ప్రాంతంలో అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు బాలికలపై కొందరు వ్యక్తులు అతిదారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన అప్పట్లో కేరళలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ స్థానిక కోర్టు ఆ మధ్య తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ఆందోళనలు వెల్లువెత్తగా.. కేరళ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, తల్లి దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ.. తిరిగి విచారణ జరపాలని ఈ ఏడాది జనవరి 6న కోర్టు ఆదేశించింది. తమ కుమార్తెలకు న్యాయం చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న మృతురాళ్ల తల్లి.. కాసరగోడ్ నుంచి తిరువనంతపురం వరకు నీతి యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఏప్రిల్ 4న పూర్తికానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ధర్మాదం నియోజకవర్గ పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవీ చూడండి:

కేరళ ఎన్నికల్లో 'ట్వంటీ 20'

'రికార్డు స్థాయి'లో ఎన్నికల్లో ఓడి కేరళ సీఎం​కు పోటీగా..

ABOUT THE AUTHOR

...view details