తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భనిరోధకతలో భారత మహిళల 'ఆధునికత'! - Family Planning 2020

దేశంలో 13.9 కోట్ల మంది మహిళలు, యువతులు అధునాతన గర్భనిరోధక పద్ధతులను అవలంబిస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఫలితంగా 5.45 కోట్ల అవాంఛిత గర్భాలు నివారణ అయ్యాయని తేలింది. గడిచిన ఎనిమిదేళ్లలో 13 అల్పాదాయ దేశాల్లో అధునాతన గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నవారి సంఖ్య రెట్టింపు అయిందని నివేదిక తెలిపింది.

in-india-over-139-million-women-and-girls-now-use-modern-methods-of-contraception-report
గర్భనిరోధకతపై మహిళల్లో పెరుగుతున్న అవగాహన

By

Published : Jan 27, 2021, 5:31 AM IST

Updated : Jan 27, 2021, 6:32 AM IST

దేశంలోని మహిళల్లో గర్భనిరోధకతపై అవగాహన పెరుగుతోంది. 13.9 కోట్ల మంది మహిళలు, యువతులు అధునాతన గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మహిళా హక్కుల పరిరక్షణకు తోడ్పడే 'ఫ్యామిలీ ప్లానింగ్-2020' అనే అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థ ఈ అంశంపై నివేదిక విడుదల చేసింది. గత ఎనిమిదేళ్లుగా కుటుంబ నియంత్రణ విషయంలో సాధించిన పురోగతిని వివరించింది.

13 అల్పాదాయ దేశాల్లో అధునాతన గర్భనిరోధక పద్ధతులు ఉపయోగిస్తున్నవారి సంఖ్య 2012 తర్వాత రెట్టింపు అయింది. గడిచిన ఒక్క సంవత్సరమే 12.1 కోట్ల అవాంఛిత గర్భాలు, 2.1 కోట్ల సురక్షితం కాని గర్భస్రావాలు, లక్షా 25 వేల గర్భిణీ మరణాలు నివారణ అయినట్లు నివేదిక తెలిపింది. భారత్​లో గర్భనిరోధక పద్ధతులు పాటించడం వల్ల 5.45 కోట్లకు పైగా అవాంఛిత ప్రెగ్నెన్సీలకు అడ్డుకట్టపడిందని వెల్లడించింది. గడిచిన ఒక్క సంవత్సరంలోనే 18 లక్షల సురక్షితం కాని అబార్షన్లు, 23 వేల గర్భిణీ మరణాలను నివారించగలిగినట్లు నివేదిక పేర్కొంది. 69 అల్పాదాయ దేశాల్లోని 32 కోట్ల మంది మహిళలు, యువతులకు కుటుంబ నియంత్రణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.

"కుటుంబ నియంత్రణకు కట్టుబడి.. ఈ కార్యక్రమాలకు భారత ప్రభుత్వం అధిక వ్యయం చేస్తోంది. గణాంకాల ప్రకారం 54 దేశాలు కలిసి 160 కోట్లు ఖర్చు చేశాయి. భారత్, ఇండోనేసియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్​ దేశాలదే ఇందులో అధిక వాటా."

-నివేదిక

2020 నాటికి కుటుంబ నియంత్రణ కోసం 3 బిలియన్ డాలర్లు వెచ్చించాలని 2017లోనే భారత్ నిర్ణయం తీసుకుంది. గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించే మహిళల సంఖ్యను 53.1శాతం నుంచి 54.3 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు లక్ష్యాలు నెరవేరాయి.

'కృషి చేస్తూనే ఉంటాం'

కాగా, ఈ ఫలితాలను కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్వాగతించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గత కొన్నేళ్లలో గర్భిణీల మరణాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. గర్భనిరోధక పద్ధతులను ప్రోత్సహించడానికి భారత్​ కృషి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. 'కుటుంబ నియంత్రణ 2020' కూటమిలో భాగం కావడాన్ని భారత్ గౌరవిస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కూటమి చేపట్టిన చర్యలను ప్రశంసించారు.

Last Updated : Jan 27, 2021, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details