తెలంగాణ

telangana

రాజ్యసభ ప్యానళ్ల సమావేశ వ్యవధిలో మెరుగుదల!

By

Published : Nov 2, 2020, 8:54 PM IST

2019-20లో ఎనిమిది రాజ్యసభ స్థాయీ సంఘాల పనితీరులో గణనీయమైన మెరుగుదల కనిపించింది. సగటు సమావేశ వ్యవధి 2 గంటల 10 నిమిషాలకు చేరింది. గతంలో ఉన్న 2 గంటల మార్క్​ను అధిగమించి రికార్డు నెలకొల్పాయి. ఈ ఏడాది మొత్తం 254 గంటల 27 నిమిషాలు సమావేశం కాగా.. అంతర్గత వ్యవహారాల కమిటీ అత్యధికంగా 47 గంటల 27 నిమిషాలు సమావేశమైంది. కరోనా మహమ్మారితో సభ్యుల హాజరు శాతం తగ్గినప్పటికీ.. సమావేశాలు కొనసాగటం గమనార్హం.

rajyasabha panels
రాజ్యసభ ప్యానళ్ల సమావేశ వ్యవధి

రాజ్యసభ సభ్యుల నేతృత్వంలోని ఎనిమిది పార్లమెంటరీ స్థాయీ సంఘాలు 2019-20లో వాటి పనితీరులో గణనీయమైన మెరుగుదల నమోదు చేశాయి. గత మూడేళ్లలో అత్యుత్తమ పనితీరును కనబరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో సగటు సమావేశ వ్యవధి 2 గంటల 10 నిమిషాలుగా ఉందని, గతంలో ఉన్న 2 గంటల మార్క్​ను తొలిసారి అధిగమించినట్లు తెలిపారు. 2018-19తో పోలిస్తే 55 శాతం మెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు. 2017-18లో సగటు వ్యవధి ఒక గంట 51 నిమిషాలు కాగా.. 2018-19లో ఒక గంట 25 నిమిషాలుగా ఉంది.

రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఆదేశాల మేరకు గత మూడేళ్లో రాజ్యసభ కమిటీల పనితీరుపై అంచనా వేసింది పార్లమెంట్​ సచివాలయం.

మూడేళ్లలో అత్యుత్తమం..

2019-20 కాలంలో మొత్తం 117 సమావేశాలు నిర్వహించాయి ఈ ఎనిమిది కమిటీలు. సభ్యుల హాజరు శాతం 49.20 శాతంగా ఉంది. గత మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యుత్తమం కావటం గమనార్హం. తొలి అర్ధభాగంలో చూసుకుంటే 2019-20లో 50.73 శాతం హాజరుతో రికార్డు నెలకొల్పాయని అధికారులు తెలిపారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా రెండో అర్ధబాగంలో సభ్యుల హాజరు శాతం 41.15 శాతానికి తగ్గినట్లు వెల్లడించారు. ఓవైపు కరోనా ఉన్నప్పటికీ కమిటీలో సగటు సమావేశ వ్యవధి 2 గంటల 23 నిమిషాలుగా చెప్పారు.

2019-20లో 50శాతం అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు హాజరైన సమావేశాలు 46.15 శాతం పెరిగాయి. గత రెండేళ్లలో అది 14.30 శాతంగా ఉండేది. కమిటీల పూర్తిస్థాయి కోరం లేకుండా సమావేశాలు నిర్వహించిన సందర్భాలు 10 శాతానికి పడిపోయాయి. గత మూడేళ్లలో ఇదే అత్యల్పం కావటం విశేషం.

మూడేళ్లలో 300 సమావేశాలు..

ఈ ఏడాది ఎనిమిది కమిటీలు మొత్తం 254 గంటల 27 నిమిషాలు సమావేశమయ్యాయి. 2017-20 వరకు చూసుకుంటే మొత్తం 300 సమావేశాల్లో 571 గంటల 22 నిమిషాలు పనిచేశాయి. మూడేళ్లలో సగటు సమావేశ వ్యవధి ఒక గంట 54 నిమిషాలుగా ఉంది. సగటు హాజరు శాతం 45.35 గా ఉంది.

తొలి స్థానంలో..

2019-20లో అంతర్గత వ్యవహారాల కమిటీ అత్యధికంగా 47 గంటల 27 నిమిషాల పాటు సమావేశమైంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన కమిటీ 42 గంటల 22 నిమిషాలు సమావేశాలు నిర్వహించింది. హెచ్​ఆర్​డీ కమిటీ 40 గంటల 44 నిమిషాలు విధులు నిర్వర్తించింది.

ప్రతిఏటా సెప్టెంబర్​లో..

పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో ఒక్కో దాంట్లో 10 మంది రాజ్యసభ నుంచి, 21 మంది లోక్​సభ నుంచి సభ్యులు ఉంటారు. ప్రతి ఏటా సెప్టెంబర్​లో ఈ కమిటీలను పునర్​వ్యవస్థీకరిస్తారు. ఇందులో ఎనిమిది కమిటీలకు రాజ్యసభ సభ్యులు, 16 కమిటీలకు లోక్​సభ సభ్యులు నేతృత్వం వహిస్తారు.

ఇదీ చూడండి:'రేపిస్టుకు రాఖీ కట్టించడం డ్రామా కాదా?'

ABOUT THE AUTHOR

...view details