నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఆపబోరని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సాగు చట్టాలపై గురువారం ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌధురీతో కలిసి రాష్ట్రపతిని కలిసిన రాహుల్.. దేశవ్యాప్తంగా సేకరించిన రెండు కోట్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సాగు చట్టాలపై జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు.
రైతుల నిరసనలు చట్టబద్దమే
"సాగు చట్టాలపై రైతులు చట్టబద్ధంగానే నిరసనలు తెలుపుతున్నారు. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు వారు దిల్లీ వదిలివెళ్లరు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలి. వ్యవసాయ రంగంపైనే కోట్ల మంది ఉపాధి ఆధారపడి ఉంది. అలాంటి రంగాన్ని నాశనం చేస్తున్నారు. సాగు చట్టాలను ప్రభుత్వం తప్పుడు పద్ధతుల్లో ఆమోదింపజేసుకుంది. ప్రధాని రైతుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారు. కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నారు. పెను విధ్వంసానికి దారితీసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. మోదీ నిర్ణయాలతో కోట్ల మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశం ఇబ్బందుల్లో పడుతుంది. వెంటనే పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరిచి చట్టాలను రద్దు చేయాలి"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత