తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోహిణి X రూప కేసులో కొత్త ట్విస్ట్.. అలా చేయొద్దని కోర్టు ఆదేశం - ఐఏఎస్​ ఐపీఎస్​ల వివాదం

కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్ల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఐఏఎస్​ అధికారిణి రోహిణి సింధూరి ఐపీఎస్​ అధికారిణి రూప.. పరస్పరం బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేసుకోగా కర్ణాటక ప్రభుత్వం వారిపై బదిలీ వేటువేసింది. అయినా వారు ఆగడం లేదు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే పోరాటం చేస్తున్నానని.. రూప మౌద్గిల్‌ మరోసారి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టగా.. ఆమెపై ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి పరువునష్టం దావా వేశారు. విచారణ జరిపిన బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు.. రోహిణి సింధూరికి పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది.

ias-rohini-sindhuri-vs-ips-roopa-court-verdict
ఐఏఎస్​ vs ఐపీఎస్

By

Published : Feb 23, 2023, 5:41 PM IST

Updated : Feb 23, 2023, 5:58 PM IST

రోహిణి సింధూరి పరువుకు భంగంకలిగించే.. ఎలాంటి ప్రకటలను చేయొద్దని ఐపీఎస్ అధికారిణి రూపను కోర్టు ఆదేశించింది. ఆమెతో సహా ప్రతివాదులకు సైతం నోటీసులు జారీచేసింది. అనంతరం విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. తన గురించి తప్పుడు ప్రచారం చేయకుండా, సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టకుండా నిషేధం విధించాలని ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. బెంగళూరు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. రూపతో పాటు 60మంది పేర్లను ఆమె తన పిటిషన్‌లో ప్రస్తావించారు. గురువారం బాధితురాలి వాదనలు విన్న సిటీ సివిల్ కోర్టు.. అనంతరం ఈ ఆదేశాలు ఇచ్చింది.

కర్ణాటకలో ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. ఐపీఎస్ అధికారిణి రూప మౌద్గిల్‌ మధ్య కొద్ది రోజులుగా పంచాయితీ కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో.. పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న ఇద్దరు మహిళా ఉన్నతాధికారులపై.. కర్ణాటక ప్రభుత్వం బదిలీ వేటు వేసినా.. వివాదానికి తెరపడలేదు. ఐపీఎస్ అధికారిణి రూప మౌద్గిల్‌పై.. ఐఏఎస్ అధికారి రోహిణీ సింధూరీ పరువునష్టం దావావేశారు. ఆమె పిటిషన్‌పై బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో.. విచారణ జరిగింది. గతంలో సైబర్‌ విభాగంలో పనిచేసిన రూప.. తన ఫోన్‌ను హ్యాక్‌ చేసి వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని రోహిణి ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా.. వృత్తిజీవితానికి మచ్చతెచ్చేలా.. ఆరోపణలు చేశారని కోర్టుకు తెలిపారు. నిరాధార ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించటమే కాకుండా మానసిక వేదనకు గురిచేశారని, అందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పటంతో పాటు కోటీ రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఐఏఎస్​ రోహిణి

తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే ఈ పోరాటమంటూ రూప పెట్టిన పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనీసం.. జాగ్రత్తపడకపోవడం వల్లనే తమిళనాడులో ఒక ఐపీఎస్​ అధికారి, కర్ణాటకలో ఒక ఐఏఎస్​ అధికారి, మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారని.. రూప తన పోస్టులో పేర్కొన్నారు. పలువురి జీవితాలు నాశనమయ్యేందుకు కారణమైన మహిళను నిలదీయక తప్పదన్నారు. ప్రజా జీవితాలను ప్రభావితం చేసే అవినీతిపై పోరుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఐపీఎస్ అధికారిణి రూప విజ్ఞప్తి చేశారు.

ఐపీఎస్ రూప
Last Updated : Feb 23, 2023, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details