తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాపై పోరుకు భారత్​, అమెరికా​ నాయకత్వం'

కరోనా మహమ్మారని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలకు అమెరికా, భారత్​ నాయకత్వం వహిస్తాయన్నారు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​. కొవిడ్​ సమయంలో అమెరికాకు భారత్​ చేసిన సాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. అలాగే.. అఫ్గానిస్థాన్​లో బలగాల ఉపసంహరణ పూర్తయినప్పటికీ ఆ దేశానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. శాంతి, సురక్షితమైన అఫ్గాన్​ కోసం ఇరు దేశాలు కృషి చేయాలని అంగీకరించినట్లు చెప్పారు.

By

Published : Jul 28, 2021, 4:08 PM IST

US Secy of State Antony Blinken
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​

కరోనా మహమ్మారిని అంతం చేయాలని భారత్​, అమెరికా నిశ్చయించుకున్నాయని, అందుకోసం ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేయనున్నాయని తెలిపారు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​. కొవిడ్​ను​ అంతం చేసేందుకు ఇరు దేశాలు ప్రపంచానికి నాయకత్వం వహిస్తాయనే నమ్మకం ఉందన్నారు.

రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్​తో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు బ్లింకెన్​. ఈ సందర్భంగా ఇరుదేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

" భారత్​కు మరోమారు రావటం చాలా సంతోషంగా ఉంది. 40 ఏళ్ల క్రితం నా కుటుంబంతో కలిసి వచ్చాను. అమెరికా, భారత్​తో పోలిస్తే.. ఇలాంటి సంబంధాలు ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికా, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. వైవిధ్యం అనేది మన దేశాల బలం. కొవిడ్​-19 అమెరికా, భారత్​ను తీవ్రంగా దెబ్బతీసింది. వైరస్​ తొలినాళ్లలో భారత్​ అందించిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. అదే రీతిలో భారత్​కు తిరిగి సాయం చేయటం పట్ల గర్వపడుతున్నాం. "

- ఆంటోని బ్లింకెన్​, అమెరికా విదేశాంగ మంత్రి.

అఫ్గాన్​తోనే ఉన్నాం..

అఫ్గానిస్థాన్​తో పాటు ప్రాంతీయ భద్రతపై చర్చించినట్లు చెప్పారు బ్లింకెన్​. శాంతి, సురక్షితమైన, స్థిరమైన అఫ్గాన్​ కోసం కృషి చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. ఒక విలువైన భాగస్వామిగా అఫ్గాన్​ అభివృద్ధి, స్థిరత్వం కోసం భారత్​ కీలకంగా మారుతుందని తెలిపారు. అఫ్గాన్​ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా ప్రాంతీయ స్థిరత్వం కోసం మద్దతుగా ఉంటామన్నారు. ఆ దేశంలో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తాలిబన్లు రెచ్చిపోతున్నట్లు సమాచారం ఉందని, అది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు బ్లింకెన్​. అయితే.. ఇప్పటికీ అఫ్గాన్​తోనే ఉన్నామని పునరుద్ఘాటించారు.

క్వాడ్​ కీలకం..

క్వాడ్​ అనేది చాలా ముఖ్యమైనదన్నారు బ్లింకెన్​. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలను పరిష్కరించేందుకు నాలుగు ఒకే ఆలోచన కలిగిన దేశాలు ఏకతాటిపైకి వచ్చాయన్నారు. క్వాడ్​ ముఖ్య ఉద్దేశం స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్​గా మార్చటమేనని స్పష్టం చేశారు. క్వాడ్​ అనేది సైనిక కూటమి కాదని.. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తూ ప్రాంతీయ సవాళ్లను అధిగమించేందుకు ఏర్పడినదేనని వెల్లడించారు.

ఇదీ చూడండి:భారత్​కు చేరుకున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details