తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లఖింపుర్ హింసపై విపక్షాలు ఫైర్- కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు

లఖింపుర్ ఖేరి హింసపై (Lakhimpur Kheri news) రాజకీయ రగడ తీవ్రమైంది. ఘటన ప్రాంతాన్ని సందర్శించేందుకు విపక్ష నేతలు ప్రయత్నిస్తుండగా.. యోగి సర్కార్ వారిని అడ్డుకుంటోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు రాజకీయ పర్యటనలు చేస్తున్నాయని భాజపా ఆరోపించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో అంతర్జాల సేవలు నిలిపివేసింది ప్రభుత్వం.

By

Published : Oct 4, 2021, 12:22 PM IST

Updated : Oct 4, 2021, 12:30 PM IST

lakhimpur violence
లఖింపుర్ హింసపై భగ్గుమన్న విపక్షాలు

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri news) ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. రైతుల పట్ల భాజపా సర్కారు వైఖరిని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav news) తీవ్రంగా తప్పుబట్టారు. బ్రిటిషర్లు సైతం ఇంతటి అరాచాలకు (Lakhimpur Kheri violence) పాల్పడలేదని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర, (Ajay Mishra Teni minister) యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ. 2 కోట్ల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.

లఖింపుర్​లో పర్యటించేందుకు అఖిలేశ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగానే లఖ్​నవూలోని ఆయన ఇంటి ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అఖిలేశ్ కాన్వాయ్ బయటకు రాగానే.. అక్కడికక్కడే ఆపేశారు. దీంతో తన ఇంటి ముందే ధర్నాకు దిగారు అఖిలేశ్. పోలీసులు, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికి పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల అఖిలేశ్​ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. (Lakhimpur Kheri news)

అఖిలేశ్​ను కార్​లో తరలిస్తున్న పోలీసులు; ఇంటి వద్ద బైఠాయించిన అఖిలేశ్ (కుడివైపు చిత్రాలు)
అఖిలేశ్ ఇంటి వద్ద రోడ్డుకు అడ్డుగా ట్రక్కు

నేతల అడ్డగింత

మరోవైపు, లఖింపుర్​కు విపక్ష నేతలు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను యోగి సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. సోమవారం ఉదయం ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రియాంక గాంధీని (Priyanka Gandhi news) పోలీసులు అడ్డుకున్నారు. అయితే, ప్రియాంకను అరెస్టు చేశారని కాంగ్రెస్ యువజన విభాగం ఆరోపించింది.

అదే సమయంలో ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి రంధావ సుఖ్​జిందర్ ఎస్ రంధావను యూపీ పర్యటనకు రానున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిరువురినీ విమానాశ్రయంలోకి అనుమతించొద్దని యూపీ సీఎస్ అవనీశ్ అవస్థీ లఖ్​నవూ ఎయిర్​పోర్ట్ అధికారులకు లేఖ రాశారు. లఖింపుర్​కు వచ్చే ఎవరినీ అనుమతించొద్దని పంజాబ్ సీఎస్​ను కోరారు.

లఖింపుర్​కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్​ను సీతాపుర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత 2.30 గంటల సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, సంజయ్ సింగ్ అక్కడి నుంచి వెనుదిరగలేదని ఆప్ నేతలు చెప్పారు.

మరోవైపు, హింస నేపథ్యంలో జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నలుగురి కన్నా ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో గుమిగూడకుండా ఆంక్షలు విధించారు.

'వీసా ఉండాలా?'

ఈ సందర్భంగా యోగి సర్కారు తీరుపై మండిపడ్డారు బఘేల్. యూపీకి రావాలంటే వీసా ఉండాలా? అని ప్రశ్నించారు. రైతుల పట్ల భాజపా ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును బట్టి వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. (Lakhimpur Kheri news)

"ఎవరైనా తమకు వ్యతిరేకంగా నిలబడితే.. అణచివేస్తామని భాజపా సందేశం ఇస్తోంది. లఖింపుర్ ఖేరిని సందర్శించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? లఖింపుర్ ఖేరిలో సెక్షన్ 144 విధించారు. మరి లఖ్​నవూకు వచ్చే వారినీ ఎందుకు అనుమతించడం లేదు? యూపీకి వచ్చే హక్కు ప్రజలకు లేదా? ఉత్తర్​ప్రదేశ్​కు రావాలంటే వీసా ఉండాలా?"

-భూపేశ్ బఘేల్, ఛత్తీస్​గఢ్ సీఎం

గెలిచేది అన్నదాతలే: రాహుల్

లఖింపుర్​ పర్యటనకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 'ప్రియాంక ధైర్యాన్ని చూసి వాళ్లు భయపడ్డారు' అంటూ ట్వీట్ చేశారు.

"ప్రియాంక.. నువ్వు వెనక్కి తగ్గవని నాకు తెలుసు. నీ ధైర్యాన్ని చూసి వాళ్లు భయపడ్డారు. న్యాయం కోసం చేస్తున్న ఈ అహింసా పోరాటంలో అన్నదాతలు విజయం సాధిస్తారు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

లఖింపుర్​కు టికాయిత్

రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్.. సోమవారం తెల్లవారుజామున ఘటన ప్రాంతానికి బయల్దేరారు. ముందుగా అన్నదాతలను కలిసి వారితో మాట్లాడతామని టికాయిత్ చెప్పారు. గ్రామస్థులు, రైతులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.

పంజాబ్ సీఎం పర్యటన!

కాగా, లఖింపుర్​లో (Lakhimpur Kheri news) పర్యటించేందుకు చరణ్​జీత్ సింగ్​ చన్నీకి అనుమతి ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని పంజాబ్ యంత్రాంగం కోరింది. ఆయన చాపర్ దిగేందుకు అనుమతించాలని లేఖ రాసింది.

'చర్యలు తీసుకోండి'

లఖింపుర్ ఘటనపై (Lakhimpur Kheri) దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు లేఖ రాశారు భాజపా ఎంపీ వరుణ్ గాంధీ(BJP MP Varun Gandhi). హింసపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. అహింసా మంత్రాన్ని పాటించే మహాత్మా గాంధీ జయంతి జరిగిన తర్వాత రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

"నిరసన చేస్తున్న రైతులు ఈ దేశ పౌరులే. అన్నదాతలు తమ సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతుంటే.. మనం కూడా ఓపికతో వాటిని పరిష్కరించాలి. లఖింపుర్ ఘటనలో నిందితులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలి. రైతులకు భవిష్యత్​లో ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలి."

-వరుణ్ గాంధీ, భాజపా ఎంపీ

ఎన్నికలపైనే విపక్షాల ధ్యాస: యూపీ మంత్రి

కాగా, విపక్షాల ఆరోపణలను ఖండించారు రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్. విపక్షాలు రాజకీయ పర్యటనలు చేస్తున్నాయని, ప్రజల అభిప్రాయాలను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, కనీసం 24 గంటలైనా వేచి చూడకుండా ఇలా చేయడం సబబు కాదని అన్నారు.

"ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర్లో ఉన్నందున రాజకీయ పర్యటనల కోసం ఈ ఘటనను విపక్షాలు వాడుకుంటున్నాయి. మీ అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో సమస్యేం లేదు. కానీ.. మృతదేహాలపై రాజకీయాలు చేయాలని ప్రయత్నించడం సరైనది కాదు. దాన్ని జరగనివ్వం."

-సిద్ధార్థ్ నాథ్ సింగ్, లఖింపుర్ ఖేరి

కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు

మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిశ్ మిశ్ర సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు యూపీ అదనపు సీఎస్ అవనీశ్ కుమార్ అవస్థీ తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా తమ చేతికి రాలేదని, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్న విషయం తెలియాల్సి ఉందని చెప్పారు.

ఇరుపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు ఎఫ్ఐఆర్​లు నమోదు చేసినట్లు అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇంటర్నెట్ అందుబాటులో లేనందున.. పూర్తి వివరాలు తెలియలేదని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది...

యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్​ ఖేరీలో హింస చెలరేగింది. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్చేయండి.

ఇదీ చదవండి:'రాజకీయాలతో రైతులను అణచివేస్తారా..?'

Last Updated : Oct 4, 2021, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details