AP High Court Suspended CID Petition on Margadarsi: మార్గదర్శి చిట్ఫండ్పై సీఐడీ వేసిన పిటిషన్ను సస్పెండ్ చేసిన హైకోర్టు
Published : Oct 19, 2023, 11:39 AM IST
|Updated : Oct 20, 2023, 10:23 AM IST
![AP High Court Suspended CID Petition on Margadarsi: మార్గదర్శి చిట్ఫండ్పై సీఐడీ వేసిన పిటిషన్ను సస్పెండ్ చేసిన హైకోర్టు high court suspended cid petition on margadarsi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-10-2023/1200-675-19805324-thumbnail-16x9-margadarsi.jpg)
11:36 October 19
బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయాలన్న సీఐడీ పిటిషన్ను సస్పెండ్ చేసిన హైకోర్టు
AP High Court Suspended CID Petition on Margadarsi: మార్గదర్శి చిట్ఫండ్ సంస్థకు చెందిన చీరాల, విశాఖపట్నం, విశాఖలోని సీతంపేట బ్రాంచ్ల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు వేర్వేరుగా జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ ఖాతాల నిర్వహణకు వీలు కల్పించాలని ఆయా బ్యాంక్ మేనేజర్లను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తే చిట్ గ్రూపుల్లోని చందాదారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
పోలీసులు స్తంభింపజేసిన బ్యాంక్ ఖాతాలు ఇతర చందాదారుల వ్యాపార కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఖాతాల నిర్వహణకు అనుమతించకపోతే.. మార్గదర్శి చిట్ఫండ్ సంస్థకు, చందాదారులకు జరిగే నష్టాన్ని తర్వాత పూడ్చలేమన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ మేనేజర్లు బ్యాంక్ ఖాతాలు నిర్వహించుకునేందుకు వీలుగా వాటిని డీఫ్రీజ్ చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు కొనసాగించేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదన్నారు. ప్రతివాదులకు నోటీసులిచ్చారు. విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామన్నారు దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు.
అత్యంత అరుదైన కేసుల్లో తప్ప.. యాంత్రికంగా ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి వీల్లేదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 ప్రకారం ఇచ్చిన నోటీసు చెల్లదన్నారు. అధికార పరిధి దాటి పోలీసులు వ్యవహరించారని, ఖాతాలను స్తంభింపజేయడం వెనుక దురుద్దేశం ఉందని వాదించారు. ఫ్రీజ్ చేయడంపై అభ్యంతరం ఉంటే స్థానిక పరిధిలోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు.. హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని వాదించారు. ఇరుపక్షాల వాదనల విన్న న్యాయమూర్తి..... ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.