దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోన్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. చెన్నైకి చెందిన ఓ వాలంటీర్ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో సమీక్షించిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది. 'వలంటీర్ అనారోగ్యంపై ఉన్న సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం, ప్రయోగాలను నిలిపివేసేందుకు అవసరమైన ఎలాంటి కారణాలు కనిపించలేదు. ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ చేపట్టిన వ్యాక్సిన్ ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయి. అన్ని డాక్యుమెంట్లను సమీక్షించిన తర్వాతే ప్రయోగాలు జరిపేందుకు ఎస్ఐఐకు అనుమతి ఇచ్చాం. మూడో దశ ప్రయోగాలు జరిపేందుకు భారత్ బయోటెక్కు కూడా అనుమతి పొందింది' అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాగా తప్పుడు ఆరోపణలు చేశారని వాలంటీరుపై రూ.100కోట్ల పరువునష్టం దావా వేస్తామన్న ప్రకటనను సీరమ్ ఇన్స్టిట్యూట్ సమర్థించుకుంది.