తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2022, 12:03 PM IST

ETV Bharat / bharat

మంచూరియా తినలేదని అమ్మమ్మ హత్య.. అద్దె ఇంట్లో శవం పూడ్చి పరార్.. ఆరేళ్లకు..

అమ్మమ్మను చంపి, అద్దె ఇంట్లో మృతదేహాన్ని పాతిపెట్టి పరారైన యువకుడ్ని, సహకరించిన అతడి తల్లిని బెంగళూరు పోలీసులు ఆరేళ్లకు అరెస్టు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర కొల్హాపుర్​లో ఉంటున్న వారిని అదుపులోకి తీసుకుని.. గురువారం కర్ణాటకకు తీసుకొచ్చారు.

mother and son murdered an old woman
మంచూరియా తినలేదని అమ్మమ్మ హత్య.. అద్దె ఇంట్లో శవం పూడ్చి పరార్.. ఆరేళ్లకు..

ఐదేళ్ల క్రితం బెంగళూరులో సంచలనం రేపిన మహిళ కేసులో నగర పోలీసులు ఎట్టకేలకు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితులు ఇద్దరిని మహారాష్ట కొల్హాపుర్​లో అరెస్టు చేసి, బెంగళూరుకు తీసుకొచ్చారు. నిందితులు సంజయ్​(26), శశికళ(46).. తల్లీకొడుకులు. మృతురాలు శాంత కుమారి.. ఆ యువకుడికి అమ్మమ్మ. ఆవేశంలో ఆమెను చంపేసిన సంజయ్.. తల్లి శశికళ సాయంతో మృతదేహాన్ని దాచిపెట్టాడు. చివరకు ఇన్నేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు.

మంచూరియా తినలేదని..
పోలీసుల కథనం ప్రకారం.. శశికళ భర్త చాలా ఏళ్ల క్రితం మరణించారు. కుమారుడు సంజయ్, తల్లి శాంత కుమారితో కలిసి బెంగళూరులోని కెంగేరి సాటిలైట్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేది శశికళ. సంజయ్.. చదువులో బాగా రాణించేవాడు. పదో తరగతి, ఇంటర్​లో 90శాతానికిపైగా మార్కులు సాధించాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కోర్స్​లో చేరాడు.

2016 ఆగస్టులో ఒక రోజు.. కాలేజీ నుంచి ఇంటికి తిరిగొస్తూ.. అమ్మమ్మ కోసం గోబీ మంచూరియా తెచ్చాడు సంజయ్. అయితే.. 69 ఏళ్ల శాంత కుమారి.. మంచూరియా తినేందుకు నిరాకరించింది. మనుమడిపైకి విసిరికొట్టింది. కోపోద్రిక్తుడైన సంజయ్.. వంట గదిలో దొరికిన ఓ వస్తువుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఫలితంగా శాంత కుమారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అప్పటి వరకు ఏదో పనిలో ఉన్న శశికళ.. కుమారుడి చేసిన పని గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే.. అలా చేయొద్దని సంజయ్​ తన తల్లిని బతిమాలాడు. ఫలితంగా ఆమె ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలని అనుకున్నారు ఆ తల్లీకొడుకులు. సంజయ్​ తన మిత్రుడైన నందీశ్​ సాయం కోరాడు.

'దృశ్యం' స్టైల్​లో మాయం..
ముగ్గురూ కలిసి శాంత కుమారి మృతదేహాన్ని ఇంటి క​బోర్డ్​లో కొన్నిరోజులు దాచి పెట్టారు. దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లారు. తర్వాత ఇంటి లోపల గోడ దగ్గర ఓ గొయ్యి తీసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఎవరూ గుర్తుపట్టలేని విధంగా అక్కడ సిమెంట్ వేసి, ప్లాస్టరింగ్ చేసి, పెయింట్ వేశారు. తమ బంధువులకు ఆరోగ్యం బాగా లేదని, ఊరెళ్తున్నామని చెప్పి.. అద్దె ఇంటి నుంచి పరారయ్యారు సంజయ్, శశికళ.

2017 మే 7న ఇంటికి మరమ్మతులు చేయిద్దామని వచ్చారు యజమాని. మృతదేహం పూడ్చిపెట్టిన గోడ దగ్గర్లో రక్తంతో తడిసిన చీర ఒకటి ఆయన కంటపడింది. చాలా రోజులుగా శాంత కుమారి కనిపించకపోవడం, తల్లీకొడుకులు అదృశ్యం కావడం వల్ల ఆయనకు అనుమానాలు తలెత్తాయి. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోడ బద్దలుకొట్టి చూడగా.. అసలు విషయం బయటపడింది. అప్పట్లో ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది.

శాంత కుమారి, శశికళ, నందీశ్, సంజయ్

ఈలోగా సంజయ్, శశికళ జాగ్రత్తపడ్డారు. తొలుత తమ స్వస్థలమైన శివమొగ్గలోని సాగర్​లో కొన్నాళ్లు ఉన్నారు. తర్వాత మహారాష్ట్రలోని కొల్హాపుర్​లో తలదాచుకున్నారు. ఏరోనాటికల్ ఇంజినీర్ కావాల్సిన సంజయ్.. ఓ హోటల్​లో సప్లయర్​గా చేరాడు. అతడి తల్లి క్లీనర్​గా పనిచేసింది.

ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ ఈ కేసుపై దర్యాప్తు సాగించారు బెంగళూరు పోలీసులు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడంలో సాయం చేసిన నందీశ్​ను పట్టుకోగలిగినా.. సంజయ్​, శశికళ ఆచూకీ మాత్రం ఎంతకీ దొరకలేదు. అయినా పోలీసులు పట్టు వీడలేదు. దర్యాప్తు కొనసాగించారు. చివరకు సంజయ్​, శశికళ కొల్హాపుర్​లో ఉన్నట్లు గుర్తించారు. గురువారం వారిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details