కొవిడ్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దై.. స్వదేశానికి వెళ్లలేక పోయిన విదేశీయులకు వీసా గడువు పొడిగించింది భారత ప్రభుత్వం. అంతకుముందు ఆగస్టు 31వరకు ఉన్న గడువును.. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల వీసాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
మార్చి, 2021 వరకు వివిధ రకాల వీసాల ద్వారా భారత్కు వచ్చి కరోనా కారణంగా విమాన సర్వీసులు రద్దై.. భారత్లోనే చిక్కుకున్న వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికార ప్రతినిధి తెలిపారు. భారత్లో ఉన్న విదేశీయులకు.. ఎలాంటి ఓవర్ స్టే పెనాల్టీ విధించకుండా వీసా గడువును పొడిగిస్తున్నామన్నారు.