ఆ పాఠశాలలో విద్యార్థుల కేరింతలు పెద్దగా వినిపించవు. అల్లర్లు కనిపించవు. ఆ స్కూల్లో ఒకే ఒక తరగతి గది ఉంది. ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారిలో రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యేది ముగ్గురే. వారికి చదువు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ పాఠశాలలో అంత తక్కువ మంది విద్యార్థులు ఉండడానికి కారణమేంటో తెలుసా? ఆ పాఠశాలకు రావాలంటే రద్దీగా ఉన్న రోడ్డును దాటాలి. అలాగే మధ్యాహ్న భోజనానికి వేరే స్కూల్కు వెళ్లాలి. ఆ స్కూల్ పేరే దుర్గా విద్యాలయ. బంగాల్లోని అసన్సోల్లో ఉంది.
తాల్పుకురియా ప్రాంతంలోని ఈ బడిలో హిందీ మాధ్యమంలో పాఠాలు బోధిస్తారు. ఈ స్కూల్లో ఒకే ఒక్క తరగతి గది ఉంది. అది కూడా వాడకంలో లేదు. విద్యుత్ సరఫరా, విద్యార్థులు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్ కూడా లేవు.రికార్డుల ప్రకారం ఈ పాఠశాలలో మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నా పాఠశాలకు హాజరయ్యేది మాత్రం ముగ్గురు నుంచి ఆరుగురే. ఇంత తక్కువ మంది విద్యార్థులు హాజరైనా కూడా వారికి చదువు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అన్ని స్కూల్ల మాదిరిగానే ఈ పాఠశాల నడుస్తున్నా.. విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా పాఠశాలలో తొలగించారు.
నాడు 350 మంది విద్యార్థులు
1927లో స్థాపించిన దుర్గా విద్యాలయ హిందీ మాధ్యమ పాఠశాలలో ఒకప్పుడు 350 మంది విద్యార్థుల ఉండేవారు. వీరందరూ 1 నుంచి 5వ తరగతికి మధ్య చదువుతున్నవారే. వాళ్లందరినీ ఒకే గదిలో ఉంచడం ఉపాధ్యాయులకు కష్టంగా ఉండేది. ఇప్పడు విద్యార్థులు లేక పాఠశాల వెలవెలబోతోంది.
ప్రస్తుతం ఈ పాఠశాలను ఇంఛార్జ్ ఉపాధ్యాయురాలు మంజు కుమారి, బబ్లూ భగత్ అనే ఉపాధ్యాయుడు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల కోసం ఉపాధ్యాయులిద్దరూ పాఠశాలకు చేరుకొని పాఠాలు చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపాధ్యాయులు ప్రయత్నించినా, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపడానికి ఇష్టపడటం లేదు.