ఇప్పటికే కరోనాతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న వేళ హిమాచల్ప్రదేశ్లో కొత్తగా నలుగురు స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ వైద్య కళాశాల(ఐజీఎంసీ) ఆస్పత్రి డా. జనక్ రాజ్ మంగళవారం వెల్లడించారు. స్క్రబ్ టైఫస్ సోకిన చిగ్గర్స్ (లార్వా పురుగులు) కాటు ద్వారా ప్రజలకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
స్క్రబ్ టైఫస్ అంటే?
స్క్రబ్ టైఫస్ను బుష్ టైఫస్ అని కూడా అంటారు. ఓరియెన్షియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి కలుగుతుంది. ఈశాన్య ఆసియా, ఇండోనేషియా, చైనా, జపాన్, భారత్, ఉత్తర ఆస్ట్రేలియాల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తోంది.
లక్షణాలు..
స్క్రబ్ టైఫస్ లక్షణాలు కూడా ఎన్నో ఇతర రోగాల లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. పురుగు కుట్టిన 10 రోజుల్లో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడుతుంటాయి. అవి..
- జ్వరం, చలి జ్వరం
- తల నొప్పి
- ఒళ్లు, కండరాల నొప్పులు
- పురుగు కుట్టిన చోట నల్లటిమచ్చ
- మానసిక మార్పులు (భ్రమ నుంచి కోమా వరకు)
- ఒంటిపై ఎర్రటి దద్దుర్లు
- తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి అవయవాల వైఫల్యం, రక్తస్రావం జరిగి చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
చికిత్స ఎలా?
పై లక్షణాలు కనపడినా, ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో సంచరించినా ఆ సమాచారం వైద్యులకు వెల్లడించాలి. వైద్యులు.. రక్త పరీక్షలు చేయవచ్చు. టెస్టు రిపోర్టులు రావడానికి వారాల సమయం పడుతుంది. కాబట్టి అంతకన్నా ముందే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంది.