పాకిస్థాన్ అనుకూల వైఖరి అవలంబిస్తూ వచ్చిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ(92) (Geelani Death) మృతిచెందారు. 1929 సెప్టెంబర్ 29న బందిపొరా జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన ఆయన.. లాహోర్లోని ఓరియంటల్ కాలేజీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. అనంతరం జమాత్-ఏ-ఇస్లామిలో చేరారు. సోపోర్ నియోజకవర్గం నుంచి 1972, 1977, 1987 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 26 పార్టీలతో వేర్పాటువాద సమ్మేళనంగా ఏర్పడిన హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుల్లో గిలానీ ఒకరు.
హురియత్కు జీవిత కాల ఛైర్మన్గా ఉన్న గిలానీ.. ఆర్టికల్ 370(Article 370) రద్దు అనంతర పరిణామాలతో 2020 జూన్లో హురియత్కు గుడ్ బై చెప్పారు. హురియత్లో రెండోతరం నాయకత్వంలో పురోగతి లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా అప్పట్లో ఆయన ప్రకటించారు. ప్రస్తుతం గిలానీ మరణంతో కశ్మీర్లో భారత వ్యతిరేక, వేర్పాటువాద రాజకీయాల అధ్యాయానికి ముగింపు పలికినట్లు అయింది.
2002 నుంచి మూత్రపిండ సంబంధిత వ్యాధితో గిలానీ బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్రం కాగా.. ఒక కిడ్నీని తొలగించారు. గత 18 నెలలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వస్తోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ పలు సంస్కరణల కోసం పనిచేవారు గిలానీ.
గిలానీ 2010 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు.
కర్ఫ్యూ ఆంక్షలు..
కశ్మీర్ లోయలోని మసీదులు గిలానీ(Syed Ali Shah Geelani) మృతి పట్ల సంతాపం ప్రకటించాయి. ఇక ఆయన నివాసం చుట్టూ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. వేర్పాటువాద నేతలు పెద్దఎత్తున గుమికూడకుండా శ్రీనగర్లో భారీ సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి.
ముగిసిన అంత్యక్రియలు..
కశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కలగొచ్చన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో రాత్రిసమయంలోనే అంత్యక్రియలు పూర్తిచేయాలని గిలానీ కుటుంబ సభ్యులను కోరారు అధికారులు. భారీ భద్రత నడుమ ఇస్లాం మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గిలానీ కోరిక మేరకు ఆయన నివాసానికి సమీపంలోని ఓ మసీదు ప్రాంగణంలో సమాధి చేశారు. అయితే తన తండ్రి అంత్యక్రియలను శ్రీనగర్లోని ఓ ఈద్గాలో నిర్వహించాలని అనుకున్నట్లు గిలానీ కుమారుడు నయీం తెలిపారు.
బంధువులకే అనుమతి..