తెలంగాణ

telangana

'ఆమె నుంచి రూ.2కోట్ల పెయింటింగ్ కొనిపించారు.. పద్మభూషణ్​ ఇస్తామని..'

By

Published : Apr 24, 2022, 9:55 AM IST

Updated : Apr 24, 2022, 10:07 AM IST

Priyanka Gandhi Rana Kapoor: మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఈడీకి కీలక విషయాలను వెల్లడించారు ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నుంచి రూ.2 కోట్లతో ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్​ కొనుగోలు చేయాలని తనను బలవంతం చేసినట్లు ఆయన వెల్లడించారు.

rana kapoor
Priyanka Gandhi

Priyanka Gandhi Rana Kapoor: కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నుంచి ఎంఎఫ్​ హుస్సేన్ పెయింటింగ్​ను రూ.2కోట్లకు కొనుగోలు చేయాలని తనపై ఒత్తిడి చేసినట్లు ఎస్ బ్యాంక్​ వ్యవస్థాపకుడు రాణా కపూర్​ తెలిపారు. నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మురళీ దేవరా బలవంతం చేసినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డెరక్టరెట్​ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బదులుగా తనకు పద్మభూషణ్​ పురస్కారం లభిస్తుందనే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివరాలను ముంబయిలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో ఈడీ ప్రస్తావించింది.

ఈ నిధులతో సోనియాకు చికిత్స!: చెక్కు ద్వారా తాను అందించిన రూ.2 కోట్లను న్యూయార్క్​లో సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు రాణా కపూర్ తెలిపారు. అయితే తనకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదని అన్నారు. "సోనియా చికిత్సకు సహకరించడం ద్వారా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశానని ఆమె సన్నిహితుడు అహ్మద్​ పటేల్ నాతో అన్నారు. నాకు పద్మభూషణ్ అందడంలో ఇది తోడ్పడుతందని చెప్పారు. అయితే ఈ కొనుగోలు బలవంతంగా జరిగింది, అందుకు నేను సిద్ధంగా లేను" అని రాణా పేర్కొన్నారు.

రాణా కపూర్​, ఆయన కుటుంబంపై నమోదైన మనీలాండరింగ్​ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. గౌతమ్​ థాపర్​కు చెందిన అవంతా కంపెనీకి ఎస్​ బ్యాంక్​ నుంచి అక్రమంగా రూ.1900 కోట్ల రుణాన్ని అందిచడంపైనా కేసు నమోదైంది. అందుకోసం రాణాకు రూ.300 కోట్ల లంచం ముట్టిందని ఈడీ ఆరోపించింది.

భార్యకు తెలియకుండానే: 58 కంపెనీలు, పదుల కొద్దీ అనుబంధ సంస్థలతో దాదాపు 100కు పైగా కంపెనీలు ఏర్పాటు చేసి దాదాపు రూ.670 కోట్లను రాణా కపూర్ దారి మళ్లించారని ఈడీ రెండో అదనపు ఛార్జ్​షీట్​లో పేర్కొంది. వాటిని అమెరికా, యూకేలో ఆస్తుల కొనుగులుకు వినియోగించినట్లు వెల్లడించింది. పూర్తిగా అతడి భార్య బిందు పేరిట ఉన్న ఆర్​ఏబీ ఎంటర్​ప్రైజెస్​కు రూ.832 కోట్లను రాణా అందించినట్లు ఏప్రిల్​ తొలినాళ్లలో దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో తెలిపింది. అయితే కేవలం గృహిణిగా ఉన్న ఆమెకు ఈ నిధులు ఎక్కడి నుంచి, ఎందుకు వచ్చాయనేది అవగాహన లేదని వివరించింది.

ఇదీ రాణాపై కేసు:డీహెచ్​ఎఫ్​ఎల్​​పై లఖ్​నవూ పోలీసులు నమోదు చేసిన చీటింగ్​ కేసు ఆధారంగా రాణా కపూర్, ఆయన భార్య, కూతుళ్లు, డీహెచ్​ఎఫ్​ఎల్ ప్రమోటర్ కపిల్ వధవాన్ సహా పలువురు ఎస్ బ్యాంక్ అధికారులపై 2019 డిసెంబర్​లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ ప్రకారం.. 2018 ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో డీహెచ్​ఎఫ్​ఎల్ స్వల్పకాలిక డిబెంచర్లలో ఎస్ బ్యాంక్ రూ.3700 కోట్ల పెట్టుబడి పెట్టింది. అనంతరం ఓ డీహెచ్​ఎఫ్​ఎల్ సబ్సిడరీకి రూ.750 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేసింది. బదులుగా రాణా కపూర్​ కుటుంబానికి చెందిన ఓ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా రూ.600 కోట్ల రుణాన్ని డీహెచ్​ఎఫ్​ఎల్ అందినట్లు ఈడీ పేర్కొంది. అయితే దీనిపై విచారణ జరుగుతున్న క్రమంలోనే 2020 మార్చిలో విదేశాల్లోని తన ఆస్తులను జప్తు చేయకుండా వాటిని అమ్మేందుకు రాణా తీవ్రంగా ప్రయత్నించినట్లు ఈడీ వెల్లడించింది.

ఇదీ చూడండి:రాణా కపూర్‌కు చెందిన రూ.127 కోట్ల ఫ్లాట్‌ సీజ్‌!

Last Updated : Apr 24, 2022, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details