FIRST ORPHAN SI: మహారాష్ట్రలో తొలిసారి ఓ అనాథ యువతి రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సైగా ఎంపికైంది. కంప్యూటర్ ఇంజినీరింగ్లో పట్టా సంపాదించిన సుందరి.. తొలి ప్రయత్నంలోనే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే.. ఎంతటి కష్టంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించింది.
Sundari Orphan SI:మూడేళ్ల వయసులోనే అనాథ శరణాలయానికి చేరుకుంది ఈ యువతి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను.. మాన్ఖుర్ద్లోని 'సంపర్క్ బాల్గ్రామ్' ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లారు. తల్లిదండ్రులెవరో తెలియదు. సొంత ఊరు అనేది లేదు. ఈ పరిస్థితుల్లో ఆశ్రమంలోని సిబ్బందే ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. వీరి ఆప్యాయతల మధ్య పెరిగిన యువతి.. ఆశ్రమంపై ప్రేమను చాటుకుంది. అనాథ శరణాలయం పేరును తన పేరులో చేర్చుకుంది. సుందరి సంపర్క్ బాల్గ్రామ్గా మారిపోయింది.
2014లో తన పద్దెనిమిదేళ్ల వయసులో సుందరి.. పైచదువుల కోసం ఆశ్రమాన్ని విడిచి బయటకు వెళ్లింది. పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటూ కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు వివాహం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న సుందరి కలకు.. ఆమె భర్త అండగా నిలిచారు. సుందరికి అన్ని విధాలా సహకరించారు.
భర్త నుంచి లభించిన పూర్తి సహకారంతో.. ఏకాగ్రతతో చదువుపై దృష్టిసారించింది. 2019లో సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సుందరి.. సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించింది. తల్లిదండ్రులు లేరన్న బాధను దిగమింగి.. జీవితంలో స్థిరపడేందుకు సుందరి చేసిన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తోంది. నిరాశనిస్పృహలకు లోనుకాకుండా జీవితంలో పోరాటం కొనసాగించాలని సుందరి.. అందరికీ సందేశాన్ని అందిస్తోంది.
ఇదీ చదవండి:ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం సూపర్.. నెలలో 15సార్లు స్వీట్లు