తెలంగాణ

telangana

ETV Bharat / bharat

35 ఏళ్లుగా 'బొన్సాయ్​' మొక్కల పెంపకంలో ప్రొఫెసర్​

35 ఏళ్ల నుంచి బొన్సాయ్ విధానంలో చెట్లను పెంచుతున్నారు ఓ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు ఈ చెట్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు. వీటిని ప్రతి ఒక్కరు పెంచితే వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు.

By

Published : Mar 4, 2021, 8:09 PM IST

father and son are in love with bonsai trees nurturing over 1500 plus trees
బోన్సాయ్​ మొక్కల ప్రేమలో తండ్రీకొడుకులు!

బొన్సాయ్​ మొక్కల ప్రేమలో తండ్రీ కొడుకులు!

భూతాపం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎన్ని చెట్లు పెంచితే పర్యావరణానికి అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో మనుషులు, ఇతర జీవుల నివాసానికి సరిపడే వాతావరణం భూమిపై ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. పర్యావరణ స్పృహతో, సామాజిక బాధ్యతతో పెద్దసంఖ్యలో చెట్లను పెంచుతున్న వారు అక్కడక్కడా కనిపిస్తారు. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ గుర్ముఖ్ సింగ్ ఆ కోవకే చెందుతారు. పచ్చదనం అన్నా, గార్డెనింగ్ అన్నా ఆయనకు అమితాసక్తి. 35 ఏళ్ల నుంచీ బొన్సాయ్ విధానంలో చెట్లను పెంచుతున్నాడు. ఈ మొక్కలకు ప్రత్యేక పోషకాలు అందిస్తూ, కన్న బిడ్డల్లా సాకుతున్నాడు గుర్ముఖ్ సింగ్.

''నా తోటలో 1500 మొక్కలున్నాయి. ఈ మొక్కలన్నీ ట్రేలలో కొంత ఎత్తు వరకే పెరుగుతాయి. ఆ ట్రేను బొన్ అంటారు. బొన్‌లో పెరిగే మొక్కను సాయ్ అంటారు. బొన్సాయ్ మొక్కలు బతకాలంటే సరైన సంరక్షణ, నిర్వహణ అత్యవసరం. లేకపోతే అవి చనిపోతాయి. వీటికి ఎరువు కూడా ద్రవరూపంలోనే అందించాలి.''

-గుర్ముఖ్ సింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్

గుర్ముఖ్ సింగ్ తన ఇంటి మిద్దెపై 130 యార్డుల స్థలంలో బొన్సాయ్ విధానంలో మొక్కలు పెంచుతున్నాడు. అంతరించిపోయే దశలో ఉన్న ఎన్నో రకాల బొన్సాయ్‌లు, కనుమరుగైపోతున్న మొక్కలు గుర్ముఖ్ సింగ్ తోటలో కనిపిస్తాయి.

''ఎక్కడ భవన నిర్మాణ పనులు ప్రారంభించినా.. ముందుగా ఆ ప్రాంతంలోని చెట్లన్నీ నరికేస్తాం. ఫలితంగా పంజాబ్‌లో చాలా చెట్లు కనుమరుగయ్యాయి. చెట్ల పెంపకంలో మా అమ్మే నాకు స్ఫూర్తి. తర్వాత ఓ ప్రొఫెసర్ ఈ గార్డెన్‌ను తయారుచేశారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. గత 20 ఏళ్ల నుంచీ, పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో జరిగే ఫ్లవర్ ‌షోలో.. బొన్సాయ్ పూలను మేమే ప్రదర్శనకు ఉంచుతున్నాం. ఇప్పుడైతే ఈ ప్రదర్శనకు చాలా మందే వస్తున్నారు. బొన్సాయ్‌ల పెంపకంపై ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నా.''

-గుర్ముఖ్ సింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్

మొక్కలు ఆక్సీజన్‌ను ఇవ్వడమే కాదు..మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయనీ, ఒత్తిడిని తగ్గిస్తాయనీ చెప్తున్నాడు గుర్ముఖ్ సింగ్. ఫలితంగా ఎన్నో వ్యాధులు దరిచేరకుండా ఉంటాయంటున్న గుర్ముఖ్.. చెట్లు మంచి మిత్రులని అంటున్నాడు.

''మొక్కల వల్ల చాలా లాభాలున్నాయి. ప్రతిరోజూ ఓ కొత్త పువ్వు చూడొచ్చు. రోజుకొక ఆకు పుట్టుకొస్తుంది. ఈ మొక్కలపై ప్రేమ పెంచుకుంటే, అవి మీకు బదులుగా అంతులేని ఆనందాన్ని ఇస్తాయి. మొక్కలతో స్నేహం చేస్తే, మనకే కాదు, మన పరిసరాలకూ మేలు జరుగుతుంది. అరకిలో ఆక్సీజన్‌ను విడుదల చేసినా.. ఈ కాంక్రీట్ జంగిల్‌లో స్వచ్ఛమైన గాలి పీల్చి బతికే అవకాశం మనకు కలుగుతుంది కదా.''

-గుర్ముఖ్ సింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్

గుర్ముఖ్ సింగ్‌కు తన తల్లి వల్లే మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు గుర్ముఖ్ కుమారుడూ ఇష్టంగా మొక్కలు, చెట్ల కోసం సమయం కేటాయిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సమయంలో ఈ గార్డెనింగ్‌ తమకో వరంలా మారిందని చెప్తున్నారు.

''బొన్సాయ్ విధానంలో గార్డెనింగ్‌ కళను నేర్చుకునే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రదర్శనలో పాల్గొన్నప్పుడు మాకు ఎంతోమంది నుంచి ప్రశంసలు దక్కాయి. ఇదంతా ఎలా చేశారని చాలా మంది ఎంతో ఉత్సాహంతో అడిగారు. ఆ సమయంలో మాకు చాలా గర్వంగా అనిపించింది. మాకు తెలిసిన కళను మరికొంతమందికి నేర్పించాం. అలా అయినా మరిన్ని తరాలకు చేరుతుందని మా ఆశ. లాక్‌డౌన్ కాలంలోనూ ఈ చెట్ల మధ్యే సమయాన్నంతా గడిపాం. ఈ మొక్కల వల్లే ఆ లాక్‌డౌన్ కాలాన్ని కూడా చక్కగా ఆస్వాదించాం.''

-జస్‌దీప్ సింగ్, గుర్ముఖ్ సింగ్ కుమారుడు

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కనీసం ఒక్క మొక్కనైనా నాటి, దాని సంరక్షణ, నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే.. కొద్ది కాలంలోనే గాలి కాలుష్యం నిర్మూలించొచ్చని చెప్తున్నాడు గుర్ముఖ్ సింగ్.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details