కొత్త వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యాన్ని సాధించే వరకూ వెనకడుగు వేయబోమని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు స్పష్టం చేశారు. వర్షం కారణంగా బుధవారం వాయిదాపడిన ట్రాక్టర్ల ర్యాలీని గురువారం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీక్షా స్థలి నుంచి కుండ్లి-మనేసర్-పల్వాల్ వరకు వాహనాల ప్రదర్శన కొనసాగనుంది. ఈ నెల 26న దిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించే ట్రాక్టర్ల కవాతుకు దీనిని ముందస్తు కసరత్తుగా భావిస్తున్నారు. తీవ్ర చలితో పాటు నాలుగు రోజులుగా వర్షం పడుతున్నప్పటికీ దీక్షా శిబిరాల్లో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. దిల్లీ సరిహద్దుల్లో రైతుల బైఠాయింపు ప్రారంభమై గురువారానికి 43వ రోజుకు చేరుకుంది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వేల మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కవాతుకు మహిళా రైతులు
గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించదలచిన ట్రాక్టర్ల కవాతులో పాల్గొనేందుకు హరియాణాకు చెందిన గ్రామీణ మహిళా రైతులు 200 మంది డ్రైవింగ్లో తర్ఫీదు పొందుతున్నారు. ట్రాక్టర్లతో పొలం దున్నడం వారికి తెలిసినప్పటికీ నగరంలో, జాతీయ రహదారులపై వాహనాల రద్దీ మధ్య ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా స్వయంగా నడిపేందుకు శిక్షణ తీసుకుంటున్నట్లు జింద్ ప్రాంతానికి చెందిన కిసాన్ ఏక్తా మహిళా మోర్చా అధ్యక్షురాలు షీయోకాంత్ తెలిపారు.
విస్కాన్సిన్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మద్దతు
భారత్లో ఉద్యమిస్తున్న రైతులకు అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాబిన్ జె వోస్ మద్దతు తెలిపారు. కర్షకుల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూకు ఆయన లేఖ రాశారు. అమెరికాలో ఉన్న భారతసంతతి ప్రజల ప్రతినిధిగా తాను ఈ వినతిని సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విస్కాన్సిన్లో సిక్కులు గణనీయ సంఖ్యలో ఉన్నారు.