తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2020, 11:55 AM IST

Updated : Dec 25, 2020, 1:25 PM IST

ETV Bharat / bharat

'కేరళ, బంగాల్​లో రైతు నిరసనలు ఎందుకు లేవు?'

pm-to-interact-with-farmers-today
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

13:19 December 25

వారి మాయలో పడొద్దు: మోదీ

ఎన్నికల్లో తిరస్కరణకు గురైన వారు.. ఇప్పుడు ప్రచారం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని  ఆరోపించారు ప్రధాని మోదీ. అలాంటి వారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. దీర్ఘకాలంగా కేరళను పాలించిన వారు పంజాబ్​ రైతులకు మద్దతు తెలుపుతున్నారు కానీ, సొంత రాష్ట్రంలో మండీల ఏర్పాటుకు చేసిందేమీలేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దేశంలోని 80 శాతం మంది రైతులు నిరుపేదలుగా మారారని, వారి కోసం వ్యవసాయ సంస్కరణలు అవసరమన్నారు. తమ ప్రభుత్వం మరిన్ని పంటలను కనీస మద్దతు ధర పరిధిలోకి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.  

" మండీలు, ఏపీఎంసీల గురించి మాట్లాడుతున్న వారే బంగాల్​, కేరళను నాశనం చేశారు. కేరళలో ఏపీఎంసీలు, మండీలు లేవు. మరి కేరళలో నిరసనలు ఎందుకు లేవు? అక్కడ వారు ఉద్యమాలు ఎందుకు ప్రారంభించలేదు? కానీ..వారు పంజాబ్​ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు." 

               - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి  

13:07 December 25

అవినీతికి తావు లేదు: మోదీ

బంగాల్​ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం అమలుకు నిరాకరించి, సుమారు 70 లక్షల మంది రాష్ట్ర రైతులకు సాయం అందకుండా చేశారని మండిపడ్డారు.

" అవినీతి ఏ విధంగా ఉన్నా అది దేశానికి హానికరమని వాజ్​పేయీ భావించారు. పౌరుల కోసం ఇప్పుడు దిల్లీ నుంచి పంపిన డబ్బు విలువ తగ్గదు లేదా అవినీతి పరుల చేతికి వెళ్లదు. నేరుగా రైతుల ఖాతాల్లోకే చేరుతుంది. మధ్యవర్తులు, కమీషన్​ ఏజెంట్లు ఉండరు. బంగాల్​ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం నాశనం చేసింది. సొంత రైతులకు ప్రయోజనాలు అందకుండా చేయటం ద్వారా  రాజకీయాలు చేస్తున్నారు. "

     - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

12:41 December 25

'సాగు చట్టాలపై వదంతులు సృష్టిస్తున్నారు'

  • ఒప్పంద వ్యవసాయంపై అనేక అపోహలు ప్రచారం చేస్తున్నారు: ప్రధాని
  • నూతన సాగు చట్టాల విషయంలో వదంతులు సృష్టిస్తున్నారు: ప్రధాని
  • కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.18 వేల కోట్లు విడుదల : ప్రధాని
  • కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 9 కోట్లమంది రైతులకు లబ్ధి: ప్రధాని
  • నూతన సాగు చట్టాలపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు: ప్రధాని

12:31 December 25

'కిసాన్​ క్రెడిట్​ కార్డులపై రైతులకు తెలపండి'

కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ రైతులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కిసాన్​ క్రెడిట్​ కార్డులుపై తోటి రైతులకు తెలియజేయాలని కోరారు. వాటి ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. 

12:22 December 25

రైతులకు రూ.18వేల కోట్లు విడుదల

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి పథకంలో భాగంగా అందించే పెట్టుబడి సాయం రూ.18వేల కోట్లు విడుదల చేశారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నగదు జమకానుంది.

12:15 December 25

నేరుగా రైతుల ఖాతాల్లోకే..

పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పథకంలో ప్రధాని నరేంద్ర మోదీ.. కొద్ది సేపట్లో దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు రూ.18వేల కోట్లు విడుదల చేయనున్నారని తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ కావటం వల్ల వారికి మేలు చేకూరనుందని తెలిపారు. 

12:03 December 25

'రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి'

ప్రధాని మోదీ కార్యక్రమంలో కోటి మంది రైతులు పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేసింది భాజపా. దేశవ్యాప్తంగా 19వేలకుపైగా అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. కొన్ని ప్రధాన కేంద్రాల్లో కాషాయ పార్టీ కీలక నేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దిల్లీలోని మెహ్రౌలీలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు షా.  

" దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పథకంలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ ఒక్క క్లిక్​తో రూ.18,000 కోట్లు విడుదల చేయనున్నారు. ఆయనే నిజమైన రైతు పక్షపాతి. కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) విపక్షాలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయి. ఎంఎస్​పీ కొనసాగుతుందని స్పష్టం చేయాలనుకుంటున్నా. "

       - అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి. 

11:31 December 25

రైతులను ఉద్దేశించి మాట్లాడనున్న మోదీ

పీఎం-కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం నగదు బదిలీ కార్యక్రమంలో భాగంగా దేశ రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైతుల ఆందోళనలు నేపథ్యంలో ప్రధానంగా సాగు చట్టాలపైనే మోదీ ప్రసంగం ఉండనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ చట్టాలపై ఉన్న అపోహలు తొలగిపోనున్నాయని భావిస్తున్నాయి.

కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం ద్వారా 9 కోట్ల మందికి నగదు బదిలీ చేయనున్నారు ప్రధాని. అలాగే.. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన రైతులతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో కోటి మంది రైతులు పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేసింది భాజపా. ఇందుకోసం దేశవ్యాప్తంగా 19 వేలకుపైగా అవగాహన కార్యక్రమాలను చేపట్టింది.  

Last Updated : Dec 25, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details