తెలంగాణ

telangana

By

Published : Jun 17, 2021, 1:55 PM IST

ETV Bharat / bharat

కుంభమేళాలో నకిలీ కరోనా రిపోర్టులు- 'అడ్రెస్' లేని ల్యాబ్

కుంభమేళాలో పాల్గొన్న లక్ష మందికి పైగా భక్తులకు నకిలీ కొవిడ్ రిపోర్టులు జారీ అయ్యాయి. పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నియమించుకున్న ఓ ప్రైవేటు ల్యాబ్.. 'అడ్రెస్' లేకుండా పోయింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించాయి.

ETV Bharat investigations: No COVID labs present at the Nodia address
కుంభమేళా భక్తులకు బోగస్ కొవిడ్ రిపోర్టులు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో నిర్వహించిన కుంభమేళాలో కొవిడ్ కట్టడిలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. హరిద్వార్​లో కుంభమేళాకు హాజరైన లక్ష మందికి పైగా భక్తులకు నకిలీ కొవిడ్ రిపోర్టులు జారీ అయ్యాయి. కొవిడ్ టెస్టుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న 'మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్' అనే ప్రైవేట్ ఏజెన్సీ ఈ వ్యవహారానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

అయితే, ఈ ప్రైవేటు ఏజెన్సీ తమ సంస్థ అధికారిక చిరునామాను నోయిడాగా పేర్కొంది. 'సీ-206, సెక్టార్ 63, నోడియా' అనే అడ్రెస్​ను మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్ తన అధికారిక వెబ్​సైట్​లో పొందుపరిచింది. అయితే, అసలు ఈ అడ్రెస్​లో సంస్థకు సంబంధించిన కార్యాలయమేమీ లేదు. ఈటీవీ భారత్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆస్పత్రి వెబ్​సైట్​లో అడ్రెస్
ఆ అడ్రెస్​లో ఉన్న భవనం

మరొక కార్పొరేట్ సంస్థ ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తోందని 'ఈటీవీ భారత్' గుర్తించింది. అక్కడ ఉన్న కొందరు ఉద్యోగులను ప్రశ్నించగా.. వారు కూడా ఇక్కడ అలాంటి కార్యాలయమేమీ లేదని బదులిచ్చారు. పదేళ్ల నుంచి తాము ఇక్కడ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదం గురించి వారికి వివరించిన తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకు తెలిసి ఆ భవన పరిసరాల్లో అలాంటి ల్యాబ్ లేదని స్పష్టంగా చెప్పారు.

మాక్స్ వెబ్​సైట్ పేర్కొన్న అడ్రెస్​లో మరో సంస్థ కార్యాలయం
మాక్స్ వెబ్​సైట్ పేర్కొన్న అడ్రెస్​లో మరో సంస్థ కార్యాలయం

వివాదం ఏంటంటే?

కుంభమేళా నిర్వహించేందుకు సిద్ధమైన ఉత్తరాఖండ్ సర్కారు.. భక్తులకు కొవిడ్ టెస్టులు చేయాలని నిర్ణయించుకొని, ఇందుకోసం ప్రైవేటు ల్యాబ్​లను నియమించుకుంది. అయితే, ఈ ల్యాబ్​లు నకిలీ కరోనా ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయని మీడియా కథనాల ద్వారా బయటపడింది.

దీంతో హరిద్వార్ జిల్లా యంత్రాంగం ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. అనేక ప్రైవేటు ల్యాబ్​లు నకిలీ కొవిడ్ రిపోర్టులు జారీ చేశాయని ప్రాథమిక విచారణలో తేలింది. దాదాపు లక్షకు పైగా భక్తులకు ఇలాంటి బోగస్ నివేదికలు అందినట్లు వెల్లడైంది.

సర్కారు మాట

ఈ విషయంపై రాష్ట్ర వైద్య సంచాలకుడికి ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ తెలిపారు. చెల్లింపులు చేసే ముందు ల్యాబ్​లను తనిఖీ చేయాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశించినట్లు చెప్పారు.

ఈ అంశంపై కేంద్ర కేంద్ర ఆరోగ్య శాఖ సైతం చర్చించినట్లు ఆ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే నకిలీ రిపోర్టుల సంఖ్య పూర్తిగా నిర్ధరణ కాలేదని చెప్పారు. మరో 7-8 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సవివర నివేదిక అందించనుందని చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయిలోనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:హబుల్ టెలిస్కోప్​లో సాంకేతిక సమస్య

ABOUT THE AUTHOR

...view details