Energy Swaraj Yatra: దేశంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా ఆ ప్రభావం పర్యావరణం మీద పడుతోంది. సౌరశక్తి అందుబాటులో ఉన్నా ప్రజలు దానిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో సౌరశక్తితో ఉన్న లాభాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు చేపట్టారు బాంబే ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ చేతన్ సింగ్ సోలంకీ. ఇందుకోసం ఆయన ఓ ప్రత్యేక బస్సునే తయారు చేశారు. ప్రస్తుతం ఆ బస్సును బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రదర్శనకు ఉంచారు.
ఎనర్జీ స్వరాజ్ యాత్ర పేరుతో చేతన్ చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా పూర్తిస్థాయి సౌరశక్తితో నడిచే ఓ ప్రత్యేక బస్సును తీర్చిదిద్దారు. ఇందులోనే ఆయన దేశమంతటా పర్యటిస్తున్నారు. 2020 నవంబరు 26న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పర్యటనలో ఇప్పటివరకు 473 రోజుల్లో 9,000 కిలోమీటర్లు తిరిగి సుమారు 46వేల మందికి అవగాహన కల్పించినట్లు చేతన్ చెప్పుకొచ్చారు. గంటకు 6 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ బస్సుకు 3.2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ అమర్చారు. నిద్రపోవడానికి, పనిచేసుకోవడానికి, స్నానం చేసేందుకు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉండేలా సోలంకీ ఈ బస్సును తీర్చిదిద్దారు. సోలంకీ కృషిని గుర్తిస్తూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ఆయనను ఆ రాష్ట్ర సౌరశక్తికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. ఈ ఎనర్జీ స్వరాజ్ యాత్రను 2030 వరకు నిర్విరామంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు సోలంకీ.