తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 7:53 PM IST

ETV Bharat / bharat

ఓట్ల పండుగకు రాష్ట్రం ముస్తాబు - పోలింగ్‌ కోసం సర్వం సిద్ధం

Election Materials Distribution in Telangana : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ సిబ్బంది కేంద్రాలకు తరలివెళ్లారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల వద్ద పోలింగ్‌ సామగ్రిని సిబ్బందికి అందజేశారు. అక్కడి నుంచి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది.. ఉదయం జరిగే పోలింగ్‌ కోసం సర్వం సిద్ధం చేశారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

Election Materials Distribution in Telangana
Election Materials Distribution

ఓట్ల పండుగకు రాష్ట్రం ముస్తాబు - పోలింగ్‌ కోసం సర్వం సిద్ధం

Election Materials Distribution in Telangana :హైదరాబాద్‌ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 4,119 పోలింగ్‌ కేంద్రాలు(Polling Stations) ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 312 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. 36 వేల 852 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలింగ్‌కు సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం రంగారెడ్డి పరిధిలోని 8 నియోజకవర్గాల్లో 3 వేల 453 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో 1,133 పోలింగ్ కేంద్రాలు, మేడ్చల్ పరిధిలోని 5 నియోజకవర్గాల్లో 2 వేల 439 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Polling Stations in Telangana 2023 : ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో 15 వేల 212 మంది, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 12,510 మంది సిబ్బంది, వికారాబాద్ జిల్లాలో 5 వేల 449 మంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 347 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటర్లు తమ తుది తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

తెలంగాణలో ఎన్నికలకు పోలింగ్ సామగ్రి పంపిణీ :వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి మొత్తం 215 మంది అభ్యర్ధుల బరిలో ఉండగా.. 29 లక్షల 56 వేల 439 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించి.. పోలింగ్ సామగ్రి పంపిణీని ఎనుమాముల మార్కెట్‌లో నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో.. సాంఘీక సంక్షేమ గురుకులు పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ(Election Materials Distribution) నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంల పంపిణీని మరిపెడలోని.. సెయింట్ అగస్టీన్ పాఠశాలలో చేపట్టారు. జనగామ జిల్లాలో పోలింగ్ సామగ్రిని.. సాంఘిక సంక్షేమ పాఠశాలలో చేపట్టారు. ములుగు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేపట్టారు. ములుగు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాల్లో 98 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. భూపాలపల్లి జిల్లాలోని అంబేడ్కర్ మైదానంలో పోలింగ్ సామగ్రిని అధికారులకు పంపిణీ చేశారు. భూపాలపల్లిలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 317 కాగా.. ఇందులో 109 సమస్యాత్మమైనవిగా గుర్తించారు.

ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్‌ పరిసరాలు

Telangana Assembly Election Materials Distribution : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 276 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 29 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. నల్గొండ జిల్లాలో వెయ్యి 768, సూర్యాపేట జిల్లాలో వెయ్యి 201, యాదాద్రి భువనగిరి జిల్లాలో 566.. మొత్తంగా 3 వేల 535 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 336, సూర్యాపేట జిల్లాలో 176, యాదాద్రి భువనగిరి జిల్లాలో 294 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎన్నికల అధికారులు.. ప్రలోభాల కట్టడికి తగిన చర్యలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Polling Arrangements in Telangana :ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ దాదాపుగా పూర్తైంది. సుమారు 400 పైగా రూట్లలోని 3 వేల 875 పోలింగ్ కేంద్రాలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని పంపిణీ కేంద్రాల నుంచి సామాగ్రి తరలివెళ్లింది. సుమారు ఆరున్నర వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లు, 4 వేల 800లకు పైగా కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను ఈ ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజక వర్గ పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రవి నాయక్ పరిశీలించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సహా కొల్లాపూర్, అచ్చంపేటలోని పంపిణీ కేంద్రాలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సందర్శించారు. గద్వాల, అలంపూర్ నియోజక వర్గ పంపిణీ కేంద్రాలను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎస్పీ రితిరాజ్ పరిశీలించారు. నారాయణ్‌పేట, మక్తల్ నియోజక వర్గ పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సెక్టోరియల్‌ అధికారులు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు.

ఓటు వేయకుంటే బతికి ఉన్నా లేనట్లే, వచ్చేస్తున్నాం, ఓటేస్తామంటున్న ప్రజానికం

Telangana Assembly Elections 2023 : ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లాలో 1609 కేంద్రాలను.. మెదక్ జిల్లాలో 579, సిద్దిపేట జిల్లాలో 1,151 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 7 వేల 68 సిబ్బంది, 296 మైక్రో అబ్జర్వర్లను నియమించిన ఈసీ.. 70 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 352 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాకు సంబంధించి 579 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1853 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి 1151 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 4 వేల 604 మంది విధులు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 13 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 29 లక్షల 38 వేల 424 మంది ఉన్నారు. మొత్తం 3 వేల 617 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా.. 13 నియోజకవర్గాల్లో కలిపి బరిలో 216 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వెయ్యి 65 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. ఆయా స్థానాల్లో వెబ్ క్యాస్టింగ్, వీడియో చిత్రీకరణ ద్వారా ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9 వేల మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 50 సున్నితమైన ప్రాంతాల గుర్తించగా.. మంథని తూర్పు డివిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.

ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది - ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు : సీఈఓ వికాస్​రాజ్​

పోలింగ్ ఏర్పాట్లు పూర్తి :ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోటీలో 146 మంది అభ్యర్థులుండగా.. మొత్తం 22 లక్షల 11వేల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 వేల 856 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయగా.. వీటిలో 321 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నలుగురు, కొన్నింటికి ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బందిని నియమించారు. సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన చోట్ల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కోసం రెండు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో 1456, భద్రాద్రి జిల్లాలో 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు సహా పోలింగ్ సామగ్రి, ఓటరు జాబితా అందజేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 6 వేల మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 వేల మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. వీరితో పాటు పోలీసు సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు రంగం సిద్ధం - పూర్తైన ఎన్నికల సామగ్రి పంపిణీ

ABOUT THE AUTHOR

...view details