ED Raid Senthil Balaji : మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ కార్యాలయం, నివాసంపై ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే మంత్రికి సంబంధించిన మరికొందరి నివాసాల్లో కూడా ఈడీ మంగళవారం దాడులు జరిపింది. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ విరుచుకుపడ్డారు. ఇది బీజేపీ చేస్తున్న 'బ్యాక్డోర్' బెదిరింపులని ఆయన మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించిన రెండు రోజుల తర్వాత ఇలాంటి పరిణామం జరగడం ఏంటని ఎంకే. స్టాలిన్ ప్రశ్నించారు.
"రాజకీయ ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోలేకే కేంద్రం.. ఈడీని అడ్డు పెట్టుకోని కక్షసాధింపు చర్యలకు దిగుతుంది. ఇటువంటి బెదిరింపులకు దిగే బీజేపీ రాజకీయ వ్యూహాలు ఫలించవు. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. మోదీ సర్కార్కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి."
- ఎంకే. స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
ఐదేళ్లలో రెండోసారి..
రాజధాని చెన్నైలోని మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంతో పాటు ఈరోడ్ జిల్లాలోని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) లారీ కాంట్రాక్టర్ ఇంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. బాలాజీ స్వస్థలమైన కరూర్లో కూడా సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గదిలో కూడా ఈడీ అధికారులు దాడులు చేశారు. కాగా, ఐదేళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు.. సచివాలయంలో సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి.
2016 డిసెంబరులో అప్పటి ముఖ్యమంత్రి జె జయలలిత మరణించిన కొన్ని రోజుల తర్వాత దర్యాప్తు సంస్థల దాడులు జరిపాయి. అప్పటి ప్రధాన కార్యదర్శి పి రామమోహనరావుపై వచ్చిన ఆరోపణల విచారణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వంలో ఉన్న డీఎంకే ముఖ్యులపై సోదాలు నిర్వహించింది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఈడీ దాడులపై మంత్రి సెంథిల్ బాలాజీ స్పందించారు. తన కార్యాలయాలు, నివాసాల్లో అధికారులు ఏం వెతుకుతున్నారో తనకు తెలియదని.. అయినా విచారణకు పూర్తిగా సహకారం అందిస్తానని ఆయన అన్నారు. అయితే గత నెలలో కూడా ఆదాయపు పన్ను శాఖ రాష్ట్రంలోని బాలాజీకి సంబంధించిన సన్నిహిత వ్యక్తుల ఆస్తులపై సోదాలు నిర్వహించింది.
సెక్రటేరియట్లో మంత్రి బాలాజీ కార్యాలయంపై ఈడీ అధికారుల సోదాలు జరపడం ఫెడరలిజానికే మచ్చ తెచ్చే విధంగా ఉందని సీఎం స్టాలిన్ విమర్శించారు. బీజేపీ పాలనను తప్పుబట్టే రాజకీయ శక్తులపై.. మోదీ సర్కార్ దర్యాప్తు సంస్థల సాయంతో ప్రతీకారం తీర్చుకుంటుందని స్టాలిన్ అన్నారు. సెంథిల్ బాలాజీ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించడాన్ని కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు ఖండించాయి.
ఈడీ దాడులపై కాంగ్రెస్, మమతా ఫైర్..!
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ నివాసం, కార్యాలయంపై.. ఈడీ దాడులు జరపడాన్ని కాంగ్రెస్ ఖండించింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోని మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటుందని ఆరోపించింది. బీజేపీయేతర పార్టీలను దెబ్బతిసేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం.. కేంద్ర ప్రభుత్వం లక్షణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మరోవైపు మంత్రి నివాసంపై.. ఈడీ దాడులు జరపడాన్ని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తప్పుబట్టారు. ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్య అని ఆమె ఆరోపించారు.