మట్టిలో కలిసిపోదు. నీటిలోనూ ఇంకిపోదు. అలాగే ఉంచితే ఆరోగ్యానికి ముప్పు. కాల్చితే ఇంకా ప్రమాదం. ప్లాస్టిక్ గురించే ఇదంతా. దశాబ్దాలుగా ప్లాస్టిక్ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో.. కళ్లకు కడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత ప్లాస్టిక్ సంచులను తయారు చేసింది మైసూర్లోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ. ఈ సంచులు 180 రోజుల్లోనే భూమిలో కలిసిపోతాయని తెలిపారు పరిశోధకులు. ఈ సంచిలో 5కిలోల బరువున్న వస్తువులను తీసుకెళ్లవచ్చని వెల్లడించారు.
ఈ సంచులను సహజంగా లభించే పాలీ లాక్టిక్ యాసిడ్ పాలీపెట్ నుంచి తయారు చేశారు. అదే సాంకేతికతతో లంచ్ ప్లేట్లు, స్పూన్లు, ఆహార వినియోగానికి వాడే ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ సంచుల తయారీకి డా.ఝాన్సీ పాల్, డా.పాల్ మురగన్ ఆధ్వర్యంలో 5 ఏళ్లు కష్టపడింది 15మంది శాస్త్రవేత్తల బృందం.