తెలంగాణ

telangana

నా చావుకి వారే కారణం - కలచివేస్తున్న దళిత యువకుడు మహేంద్ర వాంగ్మూలం

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 8:09 AM IST

East Godavari Dalit youth Mahendra Suicide: దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్మహత్య ఘటన.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరును కుదిపేసింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పరిహారం ఇవ్వడానికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనితను దొమ్మేరు ఎస్సీ పేట, ప్రజలు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే కదలనీయకుండా చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిలదీశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘‘ఎన్నికల్లో మీ విజయానికి కృషి చేస్తే.. మాకు చావును బహుమతిగా ఇస్తారా? మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పినా పట్టించుకోని మీరు.. ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకొచ్చారు? మేం చెప్పగానే పోలీస్​ స్టేషన్‌కు ఫోన్‌ చేస్తే మహేంద్ర ప్రాణాలు పోయేవా?’’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

East_Godavari_Dalit_youth_Mahendra_Suicide
East_Godavari_Dalit_youth_Mahendra_Suicide

East Godavari Dalit youth Mahendra Suicide: నా చావుకి వారే కారణం - కలచివేస్తున్న దళిత యువకుడు మహేంద్ర వాంగ్మూలం

East Godavari Dalit youth Mahendra Suicide: "నా చావుకు కొవ్వూరు ఎస్సై భూషణం, వైసీపీ నేతలు ముదునూరి నాగరాజు, బల్లుల సతీష్‌ కారణం. వారిని చట్టపరంగా శిక్షించాలి. ఇదే నా మరణ వాంగ్మూలం. చేనులో పనిచేసుకుంటున్న నన్ను సీఐ రమ్మంటున్నారంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకూ అక్కడ ఉంచేశారు. అసలు ఎందుకు స్టేషన్‌కు తీసుకెళ్లారో చెప్పలేదు. నన్ను చూసి ఎందుకొచ్చావని సీఐ ప్రశ్నించారు. చివరికి మా బంధువులు వచ్చాక విడిచిపెట్టారు. “ మరణానికి ముందు దళిత యువకుడు బొంత మహేంద్ర ఇచ్చిన వాంగ్మూలం ఇది.

వైసీపీలో ఆధిపత్య పోరు మహేంద్ర బలవన్మరణానికి కారణమైంది. దొమ్మేరు (Dommeru)లో ఈ నెల 6న జరిగిన ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హోం మంత్రి వస్తున్నారంటూ వైసీపీ నాయకులు నాగరాజు, సతీష్‌ ఫ్లెక్సీలు పెట్టారు. వారి ముఖాలున్న భాగాన్ని ఎవరో కత్తిరించటంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహేంద్రను ఎస్సై పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. అందుకే అతను ప్రాణాలు తీసుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఈరోజు మహేంద్ర పుట్టినరోజని.. వాడే లేకుండా పోయాడంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

దొమ్మేరులో హోంమంత్రిని అడ్డుకున్న స్థానికులు - ఉద్రిక్తత

మృతుడు మహేంద్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో పాటు హోం మంత్రి తానేటి వనిత (Home Minister Taneti Vanitha)గురువారం దొమ్మేరుకు వెళ్లారు. నాగార్జున, వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత, మహిళలు.. వనిత వాహనాన్ని అడ్డుకున్నారు.

ఆమెను రోడ్డుపైనే ఆపేశారు. పోలీసులు వారిని నిలువరించేందుకు యత్నించగా.. ‘మా గ్రామంలోకి మీరు వచ్చింది కాక మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులపైకి కుర్చీలు విసిరేశారు.

తీవ్ర ఉద్రిక్తతల నడుమ మహేంద్ర అంత్యక్రియలు పూర్తి

స్థానికుల ఆగ్రహాన్ని చూసి హోం మంత్రి రోడ్డుపైనే ఉండిపోగా.. పోలీసులు ఆమెకు రక్షణగా నిలిచారు. బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన నాగార్జున, వెంకట్రావు ప్రభుత్వం తరఫున 10 లక్షలు, వైసీపీ నాయకుడి తరఫున 10 లక్షల చెక్కు అందించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారు తిరిగొచ్చేవరకూ రోడ్డుపైనే ఉన్న హోం మంత్రి.. వారిద్వారా చర్చల సారాంశం తెలుసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

మహేంద్ర ఆత్మహత్యతో దొమ్మేరు గ్రామంలోకి ఎవర్నీ రానీయకుండా వందల సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించారు. దొమ్మేరు మీదుగా వెళ్లే వెహికిల్స్​ను అడ్డుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు దొమ్మేరు వెళ్లేందుకు సిద్ధమైన దళిత సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ను, కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌ను, ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌ను (Mahasena Rajesh) పోలీసులు గృహనిర్బంధం చేసి అడ్డుకున్నారు.

ఫ్లెక్సీ వివాదంలో యువకుడు ఆత్మహత్య - పరామర్శించేందుకు సిద్ధమైన మహాసేన రాజేష్ గృహనిర్బంధం

ABOUT THE AUTHOR

...view details