Beating Retreat Ceremony: దిల్లీలో బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో త్రివిధ దళాలు సంగీత బ్యాండ్లు ప్రదర్శన ఇచ్చాయి. దశాబ్దాల నుంచి సంప్రదాయంగా వస్తున్న ఈ బీటీంగ్ రీట్రీట్ కార్యక్రమంలో ఈ సారి డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
1000 డ్రోన్లలతో..
ఈ బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని ఈ ఏడాది సాంకేతికతతో మరింత ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావించింది. అందుకే 1000 డ్రోన్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 10 నిమిషాల పాటు సాగిన ఈ షోలో 75 ఏళ్ల స్వతంత్ర భారతాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఈ ప్రొగ్రామ్ను నిర్వహించింది కేంద్రం.
దీంతో పాటు నార్త్.. సౌత్ బ్లాక్స్ వద్ద 3-4 నిమిషాల పాటు కళ్లు చెదిరే లేజర్ షో నిర్వహించింది. రాజ్పథ్ రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలుగులీనింది.