కరోనా మహమ్మారి దేశంలోని సంప్రదాయ విద్యావిధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆన్లైన్ విద్యను తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో పాఠాల బోధనా ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పల్గర్ జిల్లాలోని మారుమూల గ్రామాలైన జవ్హార్, మోఖాడా పల్లెల్లో ఆన్లైన్ విద్య మాట అటుంచితే.. రెండు పూటలా కడుపునిండా తినలేని పేదరికంలో చిన్నారులు బతుకు వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్లకు ఆన్లైన్లో చదువుకునేందుకు కావల్సిన సదుపాయాలు ఎలా సమకూరుతాయి? ల్యాప్టాప్స్, స్మార్ట్ఫోన్స్ అంటే ఏమిటో కూడా వాళ్లకు సరిగా తెలియదు. కొద్దిమందికి కాస్తోకూస్తో తెలిసినా, అవి కొనలేని పేదరికం. కొన్నా, నెట్వర్క్ సరిగ్గా అందని మారుమూల ప్రాంతాలవి. ఈ సమస్యలన్నింటికీ దిగంత్ స్వరాజ్ ఫౌండేషన్ పరిష్కారం చూపింది.
బోల్కీశాల
మోఖడా, జవ్హార్ గ్రామాలు.. మహారాష్ట్రలోనే అత్యంత బీద ప్రాంతాలు. నిరుద్యోగం, నిరక్షరాస్యత రేట్లు ఇక్కడ చాలా ఎక్కువ. అలాంటి ప్రాంతాల్లో ఆన్లైన్ విద్య భారంగా మారిన చిన్నారుల కోసం.. దిగంత్ స్వరాజ్ ఫౌండేషన్ బోల్కీ శాల ప్రాజెక్టు ప్రారంభించింది.
"మా ఊర్లోని వరండాలపైనే బోల్కీ శాల నిర్వహించారు. తరగతులు జరిగేటప్పుడు విద్యార్థులంతా కరోనా జాగ్రత్తలు తీసుకున్నారు. రికార్డు చేసిన పద్యాలు, కథలు, సామెతలు ఉల్లాసంగా నేర్చుకుంటారు."
- హరిశ్చంద్ర రావిలే, విద్యార్థి తల్లి