ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వల్ల ఫిథోరాగఢ్ జిల్లా మున్స్యారీ హర్డియా నాలా వద్ద కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఓ నిండు గర్భిణీని(pregnant lady) ఆస్పత్రికి తరలించేందుకు 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. స్థానికుల సాయంతో ఆమెను స్ట్రెచర్పై మోసుకుంటూ కొండ దాటారు. అనంతరం అంబులెన్సు ఎక్కించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నేపాల్కు చెందిన ఈ మహిళ మన్స్యారీలో కార్మికురాలిగా పని చేస్తోంది. శుక్రవారం పురిటినొప్పులు రాగా.. 108కు ఫోన్ చేశారు కుటుంబ సభ్యులు. కొండచరియలు విరిగపడటం వల్ల వాహనం ఇంటివద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా అయింది. స్థానికుల సాయంతో గర్భిణీని మోసుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.